రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనున్న నేపథ్యంలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ (Presidential Elections) నిర్వహించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ (Election Commission) తాజాగా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పోల్ ప్యానెల్ అందించిన పెన్నుతో మాత్రమే ఓటర్లు బ్యాలెట్ను మార్క్ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఓటింగ్లో గోప్యత (సీక్రెసీ-Secrecy) పాటించాలని కోరుతూ, ప్రెసిడెంట్ పోల్లో బ్యాలెట్ పత్రాల (Ballot Papers)ను మార్కింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన పెన్ను (Pen)ను ఓటర్లకు అందించాలని ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది.
ఈ మేరకు జూలై 18 ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్కు, రాష్ట్రాలలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో "ఓటింగ్ గోప్యతను కాపాడటానికి... ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరును గుర్తించే అవకాశాన్ని నివారించడానికి ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా రూపొందించిన పెన్ను అందించాలి. ఓటర్లు బ్యాలెట్ పేపర్పై తమ ప్రాధాన్యతలు మార్కింగ్ చేయడానికి ఈ పెన్నునే ఉపయోగిస్తారు" అని ఈసీ పేర్కొంది.
రిటర్నింగ్ ఆఫీసర్ (RO), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్(AROS)లకు ఓటర్లు ఓటు వేయడానికి వైలెట్ ఇంక్ గల పెన్నులను తగినంత సంఖ్యలో ఎలక్షన్ కమిషన్ అందజేస్తుంది. తద్వారా ఓటును కేవలం వైలెట్ ఇంక్లో మాత్రమే.. ఆ పెన్తో మాత్రమే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పెన్ను కాకుండా ఏదైనా ఇతర పెన్ను, బాల్ పాయింట్ పెన్, మొదలైన వాటితో గుర్తు పెట్టినా ఆ బ్యాలెట్ పేపర్, 1974 ప్రెసిడెన్షియల్ & వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్, 31 (1) (డి) రూల్ ప్రకారం చెల్లదని ఈసీ జూన్ 15న పేర్కొంది. రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలి ఎన్నికలలో ఓటర్లకు ఇలాంటి పెన్నులే అందజేస్తారు.
పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనా సభ్యులు... జాతీయ రాజధాని ఢిల్లీ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి హక్కు ఉంటుంది. రాజ్యసభ, లోక్సభ లేదా రాష్ట్రాల శాసనసభల నామినేట్ అయిన సభ్యులకు ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హత ఉండదు. అదేవిధంగా, శాసన మండలి సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉండదు. భారత తదుపరి రాష్ట్రపతి ఎంపిక కోసం జూలై 18న జరిగే ఈ ఎన్నికలను పార్లమెంట్ హౌస్, రాష్ట్ర శాసనసభలలో నిర్వహిస్తారు. కాగా దేశ రాజధానిలో జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ పోల్స్లో ఓపెన్ ఓటింగ్ అనే కాన్సెప్ట్కు తావుండదు. అలానే ఓటు వేసే విషయంలో ఏ పొలిటికల్ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి విప్ జారీ చేయలేవు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థుల పేరుకు ఎదురుగా మార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, President Elections 2022, President of India, Ramnath kovind