టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టబోతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 45,300 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన విమర్శించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం అప్పు మొత్తం రూ. 3.18 లక్షల కోట్లకు చేరుతుందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా సమాధానాలు దాటవేసే ధోరణిలో సాగించిందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలలో మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు. మద్యం కుటుంబాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని... ఊరికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయని ఆయన విమర్శించారు. వీటికి ప్రభుత్వ ప్రోత్సహం ఉందని మండిపడ్డారు.
ఐటి రంగంలో తెలంగాణ యువత ఉద్యోగాల వాటా ఎంత ? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇందులో 75 శాతం ఉద్యోగాలు తెలంగాణేతరులే అని అన్నారు. ఐటి రంగంలో తెలంగాణ యువత ఉద్యోగాల గురించి అడిగితే... మంత్రి హరీశ్ రావు క్యాటరింగ్ అవకాశాలు వచ్చాయని అంటున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం రాయితీతో ఏర్పాటు చేసే పరిశ్రమలో 85 శాతం లోకల్ రిజర్వేషన్లు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ఉపాధి కల్పించకుడా ఈ ప్రభుత్వం తాగుబోతులను చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులను జులాయిలుగా తయారు చేస్తోంది కేసీఆరే అని ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jeevan reddy, Telangana, Trs