అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయాల అక్రమాస్తుల్ని సంపాదించిందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఏకంగా 424 శాతం పెరిగాయని ఆరోపించారు. సత్యం రామలింగరాజు తనయుడు తేజ్ రాజును వెంటపెట్టుకుని కేటీఆర్ మలేషియా ప్రధానిని కలిశారన్న మధుయాష్కీ... కేటీఆర్ నల్లధనాన్ని తేజరాజు విదేశాలకు పంపిస్తున్నాడని ఆరోపించారు. తేజరాజు భార్య నడిపే సంస్థ కార్యాలయం నుంచి చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎలాంటి టెండర్లు లేకుండా రూ. 1500 కోట్ల మిషన్ భగీరథ పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని మధుయాష్కీ మండిపడ్డారు.
బెంగళూరులో కేటీఆర్ రియల్ ఎస్టేట్ బినామీల గుట్టును ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతానని చెప్పారు. బెంగళూరులో కవిత కొన్న విల్లాల ఫోటోలు కూడా బయటపెడతానని తెలిపారు. రేపు కవిత ఆస్తుల చిట్టాను బయటపెడతానని మధుయాష్కీ తెలిపారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై న్యాయ విచారణ కోరతామని వెల్లడించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేసీఆర్ బతుకేంటో అందరికీ తెలుసని... ఆయన కుటుంబానికి సోనియాగాంధీని విమర్శించే అర్హత లేదని అన్నారు. త్యాగాలకు మారుపేరైన సోనియాను దూషించడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమని మధుయాష్కీ ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mahakutami, Telangana, Telangana Election 2018, Trs