Congress Comments on CM Kcr: తెలంగాణలో కరోనా పరీక్షలపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు సమర్థించారు. రాష్ట్రంలోని రాజ్యాంగ అధిపతి గవర్నర్ తన ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్నారు కాబట్టి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు హెచ్చరికలతో కరోనా టెస్టులు పెంచుతామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కరోనా చికిత్సను కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ లో చేర్చాలని ఆయన కోరారు. కరోనా విషయంలో ప్రభుత్వాన్ని గవర్నర్ ముందే అప్రమత్తం చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గవర్నర్ సూచనలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
గవర్నర్ ప్రభుత్వం పై విమర్శలు-సూచనలు చేస్తే విలువలు ఉన్న సీఎంలు గతంలో రాజీనామాలు చేశారని.. కేసీఆర్ రాజ్యాంగ విలువలు పాటిస్తే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వాన్ని అదేశించి ఆచరణలో పెట్టించాలని భట్టి విక్రమార్క కోరారు. కరోనా గురించి అసెంబ్లీలో తాము మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం, మంత్రులు మాటలతో టైం పాస్ చేస్తున్నారే తప్ప కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలంటే కేసీఆర్కి భయం లేదని, ప్రజల బలహీనతను కేసీఆర్ పట్టారని అన్నారు. ఎన్నికల ముందు 5 వేలు, 10 వేలు ఇస్తే ఓట్లు పడతాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Governor Tamilisai Soundararajan, Jaggareddy, Jeevan reddy, Telangana