టీఆర్ఎస్ పార్టీతో, సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ అనుబంధమున్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత, తటస్థులుగా పేరుపొందిన ఉద్యమకారులు సైతం కాషాయబాటపడుతుండటం, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పలు జిల్లాల్లో టీఆర్ఎస్ రెబల్స్ హడావుడి తెలిసిందే. అయితే, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు మరిన్న భారీ షాకులు తగలబోతున్నాయని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీతో టచ్ లో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ క్లెయిమ్ చేసుకున్నారు. అంతేకాదు, పలు అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఎంపీ ఆరోపించారు. నిజామాబాద్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ధర్మపురి అరవింద్.. తన రాజకీయ భవిష్యత్తుపైనా అనూహ్య కామెంట్లు చేశారు..
రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మరిన్ని సంచనాలు జరుగుతాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. బీజేపీలో చేరడానికి పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. బీజేపీ టచ్ లో ఉన్న ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలేనా? లేక వేరే జిల్లా వారా? అనే విషయాన్ని మాత్రం అరవింద్ వెల్లడించలేదు. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలనూ బీజేపీ స్వీప్ చేయబోతోందని ఘటాపథంగా చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో తాను కూడా అసెంబ్లీ బరిలో పోటీ చేస్తానని ఎంపీ అరవింద్ హింట్ ఇచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీలను గెలుచుకునే దిశగా, అలాగే జిల్లాలోని అన్ని సీట్లనూ కైవసం చేసుకునేలా పనిచేస్తున్నామని బీజేపీ ఎంపీ తెలిపారు. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్ గ్యారంటీ ఏమీ ఉండదని, పార్టీ ఆదేశిస్తే తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని అరవింద్ వ్యాఖ్యానించారు. అలాగే,
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనుందని, ఈ మేరకు ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లుందని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. మరోవైపు, పలు అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేస్తోందనే భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని ఎంపీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం విదేశాలకు పారిపోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందని.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎంపీ అరవింద్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Dharmapuri Arvind, Nizamabad, Trs