రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అధికార బీజేపీ సంచలన ఎంపికలు చేసింది. (BJP Rajya Sabha Candidates) తెలంగాణకు చెందిన ఓబీసీ నేత డాక్టర్ కోవా లక్ష్మణ్ (కె.లక్ష్మణ్)ను (Dr K. Laxman) పెద్దల సభకు పంపాలని నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బార్ నఖ్వీకి మరోసారి నిరాశ ఎదురైంది. రాజ్యసభ అభ్యర్థుల రెండు జాబితాల్లోనూ నఖ్వీకి చోటు దక్కలేదు. బలం లేకున్నా పోటీ చేయాలనుకుంటోన్న సీటులో ఆయనను నిలబెట్టే అవకాశాలున్నాయి. వివరాలివే..
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్కు రాజ్యసభ సీటు లభించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి విడుదల చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుంది. సుమిత్ర వాల్మికి మధ్యప్రదేశ్ నుంచి, లహర్సింగ్ సిరోయ కర్ణాటక నుంచి, మిథిలేశ్ కుమార్ ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
తెలంగాణకు చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. అందుకోసం ఆయన లక్నో బయలుదేరివెళ్లారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ నాయకత్వం అనూహ్యరీతిలో లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపుతున్నది. ఇక్కడ ప్రత్యర్థి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళుతోన్న ముగ్గురిలో ఒకరు బీసీ అయినప్పటికీ ఆయన(వద్దిరాజు రవిచంద్ర) శ్రీమంతుడు కావడం, బీజేపీ ఎంచుకున్న లక్ష్మణ్ మాత్రం సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తోన్న నేత కావడమనే తేడాను జనంలోకి తీసుకెళ్లాలనే కమలదళం ఇలాంటి ఎంపికను చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ నుంచి ముగ్గురూ ధనవంతులనే రాజ్యసభకు పంపడం, ఏపీ సీఎం జగన్ వైసీపీ నుంచి బీసీ నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిన వైనానికి కౌంటర్ గానే లక్ష్మణ్ కు బీజేపీ హైకమాండ్‘పెద్ద’పీట వేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పాగాకు ప్రయత్నిస్తోన్న బీజేపీ తాజా రాజ్యసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఒకరిని పెద్దల సభకు పంపే విషయంలో తీవ్ర కసత్తు చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్తో పాటుగా తెలంగాణకు చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, గరికపాటి మోహన్రావు, జితేందర్రెడ్డిల పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. చివరికి ఓబీసీ నేత లక్ష్మణ్కే మొగ్గు చూపించింది. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాదిరిగానే ఇప్పుడు కొత్త ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మణ్ 1999లో, 2014లో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2020 దాకా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేశారు. ఇదిలా ఉంటే
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శనివారం నాడు 10 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కోసం గోరఖ్ పూర్ సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ సీటు లభించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక నుంచి, మరో మంత్రి పీయూష్ గోయల్ ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా మళ్లీ అవకా శం కల్పించారు. యూపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజపేయి, బీఎస్పీ మాజీ ఎంపీ సురేంద్ర సింగ్ నాగర్, నిషాద్ వర్గం నేత బాబూరామ్ నిషాద్, జాతీయ ఉపాధ్యక్షురాలు దర్శనా సింగ్, ఉత్తరాఖండ్ ఓబీసీ కమిషన్ చైర్ పర్సన్ కల్నా సైనీ, బీహార్ నుంచి సతీశ్ చంద్ర దుబే, శంభు శరణ్ పటేల్, హరియాణా నుంచి కిషన్ లాల్ పన్వర్కూ బీజేపీ రాజ్యసభ సీట్లు ఇచ్చింది. సంచలన రీతిలో..
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల తొలి, తుది జాబితాలోనూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చ్యపర్చింది. సంఖ్యాబలం లేకున్నా కర్ణాటకలో మూడో సీటు కోసం బీజేపీ పోటీ చేస్తుందని, ఆ సీటును నఖ్వీకి కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతున్నది. నామినేషన్లకు మంగళవారం (మే 31) చివరి రోజు కావడంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది. జూన్ 10న ఎన్నికలు జరిగే 57 రాజ్యసభ సీట్లలో బీజేపీకి 23 సీట్లు దక్కనున్నాయి. ఇప్పటిదాకా 20 మంది పేర్లను ప్రకటించగా, చివరినిమిషంలో వెల్లడయ్యే మూడు పేర్లలో నఖ్వీకి అవకాశం దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Rajya Sabha, Telangana, Uttar pradesh