దేశంలో రాజకీయాలు బాగా ఖరీదైపోయిన వైనం ఎన్నికల సమయంలో మనందరికీ ప్రత్యక్షంగానే తెలుస్తుంది. అయితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రుల ఎంపిక, అధికార పార్టీలో సంక్షోభ సమయంలో సీఎంల మార్పుల వెనుకా అంతకంటే ఖరీదైన, కళ్లుచెమ్మగిల్లే స్థాయిలో బేరసారాలు నడుస్తున్నట్లు వెల్లడైంది. రూ.2500 కోట్లకు సీఎం సీటు ఇస్తామంటూ తనకు ఆఫర్ వచ్చిందని ఓ బీజేపీ ఎమ్మెల్యే బాహాటంగా వెల్లడించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై బీజేపీ హైకమాండ్ ను టార్గెట్ చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ నేతలేకాదు, తెలంగాణ అధికార టీఆర్ఎస్ నేతలు సైతం అనూహ్య వ్యాఖ్యలు, సవాళ్లు విసురుతున్నారు. వివరాలివి..
ముఖ్యమంత్రి మార్పుపై కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోన్న క్రమంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాళ్ సంచలన విషయాలు వెల్లడించారు. రూ.2500 కోట్లు చెల్లిస్తే ముఖ్యమంత్రి పదవి ఇప్పిస్తామంటూ ఢిల్లీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల రాయదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఈ విషయాన్ని బయటపెట్టారు. రాజకీయ నాయకులు ఎలా మోసపోతున్నది, అలా జరగకుండా ఏం చేయాలనే సూచనలు కార్యకర్తలకు ఇస్తూ ఎమ్మెల్యే తన అనుభవాన్ని పంచుకున్నారు..
‘రాజకీయాల్లో ఉన్నప్పుడు మనల్ని మోసం చేయడానికి చాలా మంది నాయకుల ముసుగులో వస్తుంటారు. టికెట్లు ఇప్పిస్తామని, ఢిల్లీలో జేపీ నడ్డానో, సోనియా గాంధీనో, ఇంకెరో పెద్ద నేతతోనో మాట్లాడిస్తామని కొందరు చెబుతుంటారు. ఇలాంటి వాళ్లు నాకూ ఎదురయ్యారు. వాజపేయి హయాంలో కేంద్రంలో కీలకంగా వ్యవహరించామంటూ ఢిల్లీ నుంచి కొందరు నా దగ్గరకొచ్చారు. నన్ను సీఎంను చేస్తానని, అందుకు రూ. 2500కోట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఆ అమౌట్ విని నేను షాకయ్యాను. రూ.2500కోట్లు అంటే ఎంతమొత్తమో తెలుసా? అని ప్రశ్నించాను. అదంతా పెట్టాలంటే ఏకంగా గోదాం కావాలిగా?’అన్నాను. అని ఎమ్మెల్యే బసనగౌడ్ తెలిపారు.
కర్ణాటకలో ఇటీవల హిజాబ్, హలాల్ వివాదాలను సరిగా డీల్ చేయని కారణంగా ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మైని హైకమాండ్ తోలగించబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా పర్యటన కూడా అందుకేననీ వార్తలు వచ్చాయి. తదుపరి సీఎం ప్రాబబుల్స్ జాబితాలో తన పేరు కూడా ఉందని ఎమ్మెల్యే బసనగౌడ్ చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో ఇప్పుడాయన సీఎం పదవి అమ్మకానికి ఆఫర్ వచ్చిందనడం కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే, అందునా కేంద్ర మంత్రిగా పనిచేసిన బసనగౌడ్ వ్యాఖ్యలు తేలికగా తీసుకోరాదని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు..
కర్ణాటకలో సీఎం పదవి రూ.2500 కోట్లకు అమ్మకం అనే వార్తలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. నేరుగా బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాను ఉద్దేశించి.. ‘నడ్డా గారు.. కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారట. మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 40 శాతం కమిషన్ ఇవ్వాలని గుత్తేదారులు, 30 శాతం కమిషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు అంటున్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారు? ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా?’అని కేటీఆర్ ప్రశ్నించారు.
Hello Nadda Ji,
❇️ Your own BJP MLA says he was asked to pay a bribe of ₹2,500 Crore to be made CM of Karnataka🙄
❇️ Contractors say they have to pay 40% Commission!
❇️ Even Hindu Mutt seers say they have to pay 30% Commission!
Kuch Kehna Hain? ED, IT, CBI Ke liye Koi Adesh? pic.twitter.com/ijPo0vANCp
— KTR (@KTRTRS) May 7, 2022
నడ్డా గతంలో కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సమయంలో ఎయిమ్స్ కు చెందిన రూ.7వేల కోట్ల నిధులను గోల్ మాల్ చేశారని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించారని ఆరోపించిన మరో ట్వీట్ ను సైతం కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘అరే.. ఆయన(నడ్డా) సత్యహరిశ్చంద్రుడి సోదరుడు కదా.. ఇదెలా సాధ్యం?’అని సెటైర్ వేశారు కేటీఆర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Dk shivakumar, JP Nadda, Karnataka, KTR