తెలంగాణ సహా ప్రపంచంలోని తెలుగువారంతా ఉత్కంఠగా ఎదురుచూసిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ ప్రతికూలత ఎదుర్కొంటున్నది. పలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసినట్లుగానే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఎన్నికలు కావడం, రెండు దశాబ్దాలకుపైగా ఆయనకు ఆత్మీయుడిగా ఉండి, అనూహ్య పరిస్థితుల్లో గెంటివేతకు గురైన ఈటల రాజేందర్ భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్ లోని SRR కాలేజీలోని రెండు కౌంటింగ్ హాళ్లలో నరాలు తెగే టెన్షన్ వాతావరణ కనిపిస్తోంది. మొత్తం 14 టేబుళ్లలో 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. ఈ వార్త రాసే సమయానికి 14 రౌండ్ల లెక్కింపు పూర్తికాగా.. 8వ, 11వ రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ లీడ్ సాధించారు. మిగతా 14 రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిపత్యం కొనసాగింది. కాగా,
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పటిదాకా 14 రౌండ్ల ఫలితాలు వెలువడగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 9452 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 14వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీకి 63,079 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 53,627 ఓట్లు పడ్డాయి. 1830 ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. కారు గుర్తును పోలిన చపాతీ మేకర్ (ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి శ్రీకాంత్)కు 1101 ఓట్లు పడ్డాయి. ఇంకా 8 రౌండ్లు లెక్కించాల్సి ఉండగా, ప్రస్తుతం ఉన్న ట్రెండే కొనసాగితే గనుక ఈటల రాజేందర్ సునాయాసంగా గెలిచే అవకాశముంది. కానీ టీఆర్ఎస్ కు పట్టున్న మండలాల్లో ఓట్లు తారుమరయ్యే అవకాశాలు లేకపోలేవు. అసలైన ఫలితాలకు మరికొంత సమయం ఉన్నా, బీజేపీ శ్రేణులు మాత్రం ముందస్తుగానే గెలుపు సంబురాలు మొదలుపెట్టారు.
హుజూరాబాద్ పోరులో ఈటల రాజేందర్ తొలి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆయనే గెలుస్తారని బీజేపీ విశ్వసిస్తోంది. గెలుపు ఈటలదే అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ కూడా ఈటలకే మద్దతు ఇచ్చిందని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బాంబు పేల్చారు. ఈ ప్రకటనల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా సేనలు RRR పోస్టర్లను ట్రెండ్ లోకి తీసుకొస్తున్నారు. కౌంటింగ్ జరుగుతోన్న SRR కాలేజీ వేదికగా ఈటల రాజేందర్ గెలుపు ద్వారా గులాబీ దళానికి RRR సినిమా చూపించబోతున్నామని బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఇప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులకు రాజేందర్ తోడైతే కేసీఆర్ సర్కారుకు RRR బొమ్మ కనిపిస్తుందని కమలనాథులు అంటున్నారు. RRR సినిమా నేడే విడుదలవుతోందంటూ కాషాయ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
హుజూరాబాద్ లో ఈటల గెలుపు నిర్ధారణ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు చేసుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోన్నట్లు సమాచారం. నిజానికి హుజూరాబాద్ లో విజయ యాత్రలపై ఈసీ నిషేధం విధించిన దరిమిలా.. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం వద్ద, అన్ని జిల్లాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద పటాకులు పేల్చి సందడి చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉండటంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ దాదాపు వెలవెలబోయింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Huzurabad, Huzurabad By-election 2021, RRR, Rrr film, Trs