ఆంధ్రా -ఒడిశా రాష్ట్రాల మధ్య పంచాయతీ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అయితే సుప్రీం తాజా తీర్పుతో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు యాధావిధిగా జరగనున్నాయి. కానీ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని సుప్రీ కోరింది.
ఒడిశా భూభాగంలో ఉన్న కోటియాలోని 3 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను సవాలు చేస్తూ ఒఢిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ అధికారులు మూడు పంచాయతీలను ఏకగ్రీవం చేశారని, పగులు చెన్నూరులో మాత్రం ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్, సీఎస్ల నుంచి సంజాయిషీ కోరాలని విజ్ఞప్తి చేస్తూ.. కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూభాగంలోని మూడు గ్రామ పంచాయతీల పేర్లను మార్చి ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారించింది. ఒడిశా అభ్యంతరాలపై వచ్చే వారం లోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం ఖన్విల్కార్ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటిదాకా ఎన్నికలు వాయిదా వేయాలని ఒడిశా తరపు న్యాయవాది కోరగా తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
తాజా సుప్రీం తీర్పుతో యధావిధిగా సాలూరు నియోజకవర్గంలోని గంజాయ్భద్ర గ్రామాల పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం అభ్యంతరాలపై వారం లోపు సమాధానం చెప్పాల్సి ఉంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. సుప్రీం తీర్పు ఎలా ఉన్నా పంచాయతీ ఎన్నిక సాఫీగా సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలు ఆపేలా తాము ఆదేశాలివ్వలేమి సుప్రీం కోర్టు చెప్పినా.. ప్రస్తుతం కొటియా గ్రామాల్లో ఒడిశా భద్రతాదళాలు భారీగా మోహరించే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల్లో ఎవరూ పాల్గొనొద్దని అక్కడి ప్రజలకు ఒడిశా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఏపీ అధికారులు మాత్రం ఎన్నికలు నిర్వహించి తీరుతామంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని.. అక్కడి ప్రజలు కూడా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో ఎన్నికలు నిర్వహించి తీరుతామని కలెక్టర్ హరిజవహర్లాల్ స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 1:30 వరకే పోలింగ్ ఉంటుందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సిబ్బందిని కూడా భారీ బందోబస్తు మధ్య తరలిస్తామని ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు.
కొటియాలో ఉన్న కొందరు గ్రామస్థులు మాత్రం తాము ఎన్నికల్లో పాల్గొంటే ఏపీ ప్రభుత్వం పథకాలు వస్తాయి కధా అని నిలదీస్తున్నారు.. రెండు రాష్ట్రా ప్రభుత్వాలు రెండు పథకాలు ఇస్తే ఎందుకు వద్దాంటాం అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.