ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. గొడ్డు చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని సంక్షేమ పథకాలను తాము ఇంటింటికీ చేరవేస్తూ జగన్ సర్కారుకు ఎంతో మంచి పేరు తీసుకురావడానికి అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. అందుకే తమకు కూడా వేతనాలు పెంచాలని, అలాగే, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వెంటనే ఆ ఆందోళనలపై స్పందించిన సీఎం జగన్ వారికి లేఖ రాశారు. వాలంటీర్ అన్నది ఒక ఉద్యోగం కాదని సేవ అని గుర్తుంచుకోవాలి అంటూ లేఖలో పేర్కొన్నారు.
వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ అందించడం. ఇది ఉద్యోగం కాదని గుర్తు చేశారు. పేదవారి ఆశీస్సులు, దీవెనలు అందుకుంటూ జీవిస్తున్న కార్యక్రమం ఇది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, ప్రజలతో మీ ఇంటరాక్షన్ పెంచేందుకు ఒక మంచి వ్యవస్థను లంచాలు లేని వ్యవస్థను తయారు చేసేందుకు, మన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని కూడా తాను గతంలోనే స్పష్టం చేశాను అన్నారు. సేవాభావం, ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేశారు కాబట్టే మిమ్మల్ని జనం ఆత్మీయులుగా చూసుకుంటున్నారని గుర్తు చేశారు.
తాజాగా గ్రామ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఉగాది రోజున వారిని సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని స్పష్టం చేశారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించారు. ప్రణాళిక శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్కు ఈ బాధ్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్ వైజ్ చేస్తారన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను కరించాలని జగన్ పేర్కొన్నారు. ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ-క్రాపింగ్ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీంతో ఇ-క్రాపింగ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టగలుగుతామన్నారు.
ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతో కూడా కలిసి పనిచేయాలని సూచించారు. డేటాను కేవలం సేకరించడమే కాకుండా.. ఆ డేటా ద్వారా తీసుకోవాల్సిన చర్యలమీద కూడా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Ap grama sachivalayam