కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు పూర్తిగా రసకందాయంలో పడ్డాయి.. సీఎం నారాయాణ స్వామి బలపరీక్షకు ముందే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుసగా రాజీనామాలు చేయడం కలవరం పెంచుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు సమర్పించగా.. తాజగా మరో ఇద్దరు ఎమ్మెల్యే సీఎంకు నారాయణ స్వామికి ఊహించని షాక్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేల పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు లక్ష్మీనారాయణన్, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేషన్ అధికారికంగా ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను కూడా స్పీకర్కు పంపించారు.
సీఎం బలపరీక్షకు ముందు ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో పరిస్థితి కాంగ్రెస్ చేజారినట్టైంది. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం బలపరీక్షకు సిద్ధం కావాలని ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. బలపరీక్ష వ్యవహారం సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని, విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలని తమిళసై ఆదేశాలు ఇచ్చారు.
నిన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా సీఎం నారాయణ స్వామి ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. బలపరీక్షలో తన బలం నిరూపించుకుంటాను అన్నారు. కానీ అక్కడి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమికి షాకిచ్చారు. ఇప్పటికే పూర్తి మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారు.. ఇక గట్టెక్కడ దాదాపు అసాధ్యమే.
పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్, డీఎంకే , స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్కుమార్ రాజీనామాలు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరి రాజీనామాతో కూటమి బలం 12కు పడిపోయింది. చేరింది. మరోవైపు ఎన్నార్ కాంగ్రెస్7, అన్నాడీఎంకే 4, బీజేపీకి 3.. వీరితో పాటు నామినేటెడ్ పదవులు మూడుతో ప్రత్యర్థి బలం 14గా ఉంది. సభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 26కు చేరింది. సో ఎలా లెక్కలు వేసుకున్నా నారాయణస్వామి బలం నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందుకే బలపరీక్షకు ముందే నారాయణ స్వామి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. కర్నాటక అసెంబ్లీలో పరిణమాలే ఇక్కడా చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. బలపరీక్ష నిర్వహించిన సరిపడ బలం లేకపోవడంతో ముందుగానే రాజీనామాను పసమర్పిస్తే కాస్త పరువైనా నిలుస్తుందని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
మరోవైపు గవర్నర్ తమిళిసై సైతం..తనదైన మార్కుతో దూకుడు చూపిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వాని బలపరీక్షకు ఆదేశించారు. తాజాగా రాజ్ భవన్ లో పలువురి ఉద్యోగులపై వేటు వేశారు. దీనికి వెనుక కూడా రాజకీయా కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా బీజేపీ వ్యూహం మాత్రం వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు అసెంబ్లీ బలపరీక్షకు ముందే నారాయణ స్వామి రాజీనామా చేస్తే.. అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో లెప్ట్ నెంట్ గవర్నర్ తో కూడా కేంద్ర పాలన అమల్లోకి వస్తుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయొచ్చు.. ఈ పరిణామాలు అన్నీ ఊహించే బీజేపీ పెద్దలు లెప్ట్ నెంట్ గవర్నర్ గా తమిళిసైకి అదనపు బాధ్యతలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Puducherry