ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును బీజేపీ నేతలు నేడు ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వివరాలు.. ఇటీవల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి.. స్థానిక జిన్నా రోడ్డులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ చేశారు. అయితే విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ భూమి పూజ చేసిన ప్రాంతంలో ధర్నాకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పురపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అయితే స్థానిక డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ధర్నాను విరమించుకొని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించిన భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చాలాసేపు తోపులాట జరిగింది.అనంతరం అక్కడే బైఠాయించిన భాజపా నేతలను ఆందోళన విరమించాలని డీఎస్పీ కోరారు. వారు ఒప్పుకోకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. రాజీవ్ కూడలి, శివాలయం కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Kadapa