చెన్నై: జయలలిత నిచ్చెలి శశికళ అన్నాడీఎంకే జెండాను తన కారుపై వినియోగించడంపై వివాదం కొనసాగుతోంది. బెంగళూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంలో గెస్ట్ హౌస్కు వెళ్లేందుకు శశికళ కారు ఎక్కారు. ఆ కారు ముందు భాగంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తు ఉండటం గమనార్హం. ఈ ఘటనపై సేలం పోలీసులకు అన్నాడీఎంకే నేతలు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత అయిన శశికళకు తమ పార్టీ జెండాను పెట్టకునే హక్కు లేదని ఫిర్యాదులో ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ గెస్ట్ హౌస్లో ఉన్న శశికళ ఫిబ్రవరి 7న తమిళనాడులో అడుగుపెట్టనున్నట్టు తెలిసింది. బెంగళూరు నుంచి చెన్నైకి శశికళ రానుండటంతో ఆమె అనుచరులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఈ సందర్భంగా స్వాగత బ్యానర్లు, కటౌట్లలో అన్నాడీఎంకే పతాకాన్ని, జయలలిత ఫొటోను వినియోగించే అవకాశం ఉంది.
శశికళ అనుచరులు చెన్నైలో భారీ ర్యాలీకి కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ ర్యాలీలో పాల్గొనే వాహనాలపై అన్నాడీఎంకే జెండాలు రెపరెపలాడే అవకాశం లేకపోలేదు. దీంతో.. అన్నడీఎంకే అధిష్టానం పార్టీ జెండాను శశికళ వర్గం వినియోగించేందుకు అవకాశం లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి జయకుమార్.. శశికళ కారుపై అన్నాడీఎంకే జెండాను వినియోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవుల నుంచి తప్పించామని, ఆ విషయం తెలిసినప్పటికీ జెండాను కారుపై వినియోగించడం చట్టరీత్యా నేరమని మంత్రి చెప్పారు.
తనకు దక్కని దానిని ధ్వంసమైనా చేయాలని శశికళ ఆశపడుతున్నారని, కానీ.. ఆమె ఆశలు ఫలించవని.. అన్నాడీఎంకే చిహ్నం రెండాకులను కూడా కనీసం కదల్చలేరని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. దినకరన్ క్షమాపణ పత్రం సమర్పిస్తే పార్టీలో చేర్చుకునే విషయాన్ని పరిశీలిస్తామని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త కేపీ మునుసామి చేసిన ప్రకటనను ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణిస్తామని మంత్రి జయకుమార్ తెలిపారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనే విషయంపై సీఎం పళనిస్వామి, పన్నీరుసెల్వం మాత్రమే నిర్ణయం తీసుకుంటారని మంత్రి జయకుమార్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIADMK, Chennai, Sasikala, Tamil nadu Politics, Tamilnadu