స్విట్జర్లాండ్లోని దావోస్(Davos)లో నేడు ప్రపంచ ఆర్థిక సదస్సు(World Economic Summit) ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు జరిగే వర్చువల్ రూపంలో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో వివిధ అంశాలపై దేశాధినేతలు చర్చించనున్నారు. నేటి ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లు ‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్’ (State Of The World)అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నారు. కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులపై ప్రభావం, వ్యాక్సినేషన్, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గత 50 సంవత్సరాలుగా స్విట్టర్లాండ్లోని దావోస్లో వార్షిక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా 2021లో నిర్వహించలేకపోయింది. ఈసారి ఎలాగైనా భౌతికంగా నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తొలుత భావించింది. దీని కోసం ఏర్పాట్లు సైతం చేసింది. అయితే, ఈ సమయంలోనే కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడంతో భౌతిక సమావేశాన్ని రద్దు చేశారు. వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్క్వాబ్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే, ఈసారి వర్చువల్ విధానంలోనే 'దావోస్ అజెండా' సమ్మిట్ను నిర్వహిస్తున్నారు.
వారం రోజుల పాటు జరిగే డిజిటల్ సమ్మిట్ ఇవాళ జిన్పింగ్ ప్రత్యేక ప్రసంగంతో ప్రారంభమవుతుంది. తర్వాత రెండు వర్చువల్ సెషన్లను నిర్వహిస్తారు. మొదటిది కోవిడ్–19, రెండోది.. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక సహకారంపై వర్చువల్ సెషన్లు ఉంటాయి. ఇక, భారత ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం తన ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రసంగిస్తారు. ఇక, మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్, జపాన్ ప్రధాన మంత్రి కిషిదా ఫుమియో తమ ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నారు. ప్రపంచ సామాజిక ఒప్పందం. అదే రోజు వ్యాక్సిన్ సవాళ్లపై ప్రత్యేక సెషన్లను కూడా నిర్వహించనున్నారు. దీనికి WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్తో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా కూడా హాజరుకానున్నారు.
ఒమిక్రాన్ నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే..
బుధవారం జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. శక్తి పరివర్తన, వాతావరణ ఆవిష్కరణలను పెంచడం, లాటిన్ అమెరికా ఔట్లుక్పై నిర్వహించనున్న ప్రత్యేక సెషన్లలో ఆయన పాల్గొంటారు. గురువారం నాడు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో వారి ప్రత్యేక ప్రసంగాలను అందించనున్నారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ESG (ఎకనామికల్, సోషల్, గవర్నెన్స్) పారామీటర్లపై ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తారు.
ఇక, చివరి రోజున, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్, నైజీరియా వైస్ ప్రెసిడెంట్ యెమీ ఒసిన్బాజో వారి ప్రత్యేక ప్రసంగాలు చేస్తారు. చివరి రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక సెషన్లు ఉంటాయి. ఈ సెషన్లలో యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్ యెల్లెన్, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ ప్రసంగాలు చేయనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 'దావోస్ ఎజెండా–2022’ కీలకమైన ప్రపంచ నాయకులకు మొదటి ప్రపంచ వేదిక అవుతుంది. 'ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్' అనే థీమ్పై ఈసారి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi