PM Modi : ఇండియా(India)లో తక్కువ మాన్యుఫాక్ఛరింగ్ కాస్ట్తో ఎక్కువ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). కోవిడ్-19 సంక్షోభం, యుద్ధం, సప్లై చైన్ సమస్యలు ఉన్నప్పటికీ, భారత వృద్ధిరేటులో వేగం తగ్గలేదని చెప్పారు. ఆదివారం వడోదరలో C-295 రవాణా విమానాల తయారీ యూనిట్కు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్లో తయారీ గురించి మాట్లాడారు. వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కన్సార్టియం సంయుక్తంగా 295 రవాణా విమానాలను తయారీ చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఎయిర్బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుయిలౌమ్ ఫౌరీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో రక్షణ, అంతరిక్ష రంగాలు భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా, స్వయం సమృద్ధిగా మార్చడానికి రెండు ముఖ్యమైన స్తంభాలుగా ఉంటాయని చెప్పారు. 2025 నాటికి డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ 25 బిలియన్ డాలర్లను అధిగమించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నామని, రక్షణ ఎగుమతులు $5 బిలియన్లు దాటుతాయని వివరించారు.
మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందడుగు
భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే దిశలో సి-295 ప్రాజెక్ట్ ఒక పెద్ద ముందడుగు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం అనేక దేశాల్లో ప్రసిద్ధి చెందిన యుద్ధ విమానాలు, ట్యాంకులు, జలాంతర్గాములు, మందులు, వ్యాక్సిన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, కార్లను తయారు చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో దేశం ఇప్పుడు రవాణా విమానాల తయారీ కేంద్రంగా మారుతోందన్నారు. ప్రయాణికులు, కార్గో విమానాలకు పెరిగిన డిమాండ్ను ఆయన హైలైట్ చేశారు. వచ్చే 15 ఏళ్లలో భారత్కు 2,000 కంటే ఎక్కువ విమానాలు అవసరమవుతాయని ప్రధాని పేర్కొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో భారత్ ఒకటి కానుందని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది గ్లోబ్’ అనే మంత్రంతో భారతదేశం ముందుకు సాగుతోందన్నారు.
Explained: ఇన్కమ్ ట్యాక్స్లో రూల్ 132 అంటే ఏంటి? పన్ను చెల్లింపుదారులకు ఇది ఎందుకు ముఖ్యమైనది?
ప్రాజెక్ట్ లక్ష్యాలు
2021 సెప్టెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖ 56 C-295MW విమానాల కోసం స్పెయిన్లోని ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం విలువ రూ. 21,935 కోట్లు. వీటిలో 16 విమానాలను స్పెయిన్ నుంచి తీసుకుంటారు. మిగిలిన 40 విమానాలను వడోదరలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో తయారు చేస్తారు. తాజా ఒప్పందం ప్రకారం 16 C-295 విమానాలను ఎయిర్బస్ స్పెయిన్లో పూర్తిస్థాయిలో తయారుచేసి, 2023 సెప్టెంబర్- 2025 ఆగస్టు మధ్య భారత్కు అప్పగించాలి. మిగతా 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో కలిసి ఇండియాలో తయారు చేయాలి. 2026 సెప్టెంబర్ నాటికి ఇక్కడ మొదటి విమానం తయారవ్వాలి. తర్వాత 2031 ఆగస్టులోపు మిగిలిన 39 విమానాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.
ప్రైవేట్ సెక్టార్ ద్వారా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విధానంలో ఇండియాలో సైనిక విమానాలు తయారు చేసేందుకు ఉద్దేశించిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. C295 ప్రోగ్రామ్తో IAF ఆధునీకరణకు తమ వంతు సాయం చేస్తామని చెప్పారు ఎయిర్బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుయిలౌమ్ ఫౌరీ. ఈ ఒప్పందం దేశంలో ప్రైవేట్ డిఫెన్స్ తయారీ రంగం అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
విమానాల ప్రత్యేకతలు
C295 అనేది ఫైవ్-10 టన్నుల సామర్థ్యం కలిగిన విమానం. 71 మంది ప్రయాణికులు లేదా 50 మంది పారాట్రూపర్లు వ్యూహాత్మకంగా ప్రయాణం చేయడానికి, లాజిస్టిక్ కార్యకలాపాల కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని అవ్రో ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ను C-295 విమానాలు భర్తీ చేస్తాయి.1960లలో కొనుగోలు చేసిన అవ్రో ప్లేన్స్ను మార్చనున్నారు. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(RFP)ను 2013లో గ్లోబల్ సంస్థలకు జారీ చేశారు. ఎయిర్బస్, TASL వేసిన ఏకైక బిడ్ను 2015లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.