ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. గ్రీన్ ఎనర్జీ (Green Energy)ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగా భారత్ (India) ఉద్గారాలను తగ్గించుకునేందుకు కీలక అడుగు వేసింది. జీవ ఇంధన వినియోగాన్ని పెంచే విధంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 20% ఇథనాల్(Ethanol) కలిపి పెట్రోల్ను విక్రయించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ (India PM Narendra Modi) నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు ఏంటో చూడండి.
* 2 నెలలు ముందుగానే మొదలైన కార్యక్రమం
ఇప్పటివరకు పెట్రోల్లో 10% ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. ఏప్రిల్లో జరిగే ఇండియా ఎనర్జీ వీక్(IEW)-2023 సందర్భంగా 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే రెండు నెలల ముందే ప్రధాని మోదీ ప్రారంభించడం గమనార్హం. కాగా, 2025 నాటికి పెట్రోల్లో10% ఇథనాల్ ఈ పరిమాణాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
* రెండేళ్లలో దేశవ్యాప్తంగా అమలు
మొదటి దశలో 15 నగరాల్లో ఎంపిక చేసిన బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ను విక్రయించనున్నారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా పరోక్షంగా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఫారెక్స్ అవుట్గోలో భారత్కు రూ.53,894 కోట్లు ఆదా కానుంది. E-20 పెట్రోల్ 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు ఇంధన రిటైలర్స్కు చెందిన 84 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి రానుంది.
* చమురు అవసరాలకు 85% దిగుమతి
చెరకుతో పాటు విరిగిన బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ తయారు చేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్ ఉంది. ఇకపై చమురు దిగుమతిని తగ్గించుకోవడంలో ఈ చర్యలు ఇండియాకు ఉపయోగపడనున్నాయి. భారత్ ప్రస్తుతం చమురు అవసరాల కోసం 85% దిగుమతులపై ఆధారపడి ఉంది.
ఇది కూడా చదవండి : వందే భారత్లో ముందుగానే మీల్స్ బుక్ చేసుకుంటే మేలు? ఎందుకో చూడండి!
* బైకుల్లో 50% ఉద్గారాల తగ్గుదల
ఇథనాల్ లేని పెట్రోల్లతో పోలిస్తే E20ని ఉపయోగించడం వల్ల ద్విచక్ర వాహనాల్లో సుమారు 50 శాతం, ఫోర్ వీలర్స్ల్లో దాదాపు 30 శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, హైడ్రోకార్బన్ ఉద్గారాలు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లలో 20 శాతం తగ్గుతాయని అంచనా.
* 540 కోట్ల లీటర్ల బ్లెండింగ్ లక్ష్యం
2022 నవంబర్ 30తో ముగిసిన సప్లై సంవత్సరంలో 440 కోట్ల లీటర్ల ఇథనాల్ను పెట్రోల్లో కలిపారు. వచ్చే ఏడాది నాటికి 540 కోట్ల లీటర్ల సేకరణను పెద్ద మొత్తంలో బ్లెండింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్లో ఇథనాల్ కల్పడం ద్వారా చెరకు రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. గత ఎనిమిదేళ్లలో ఇథనాల్ సరఫరాదారులు రూ.81,796 కోట్లు ఆర్జించగా, రైతులకు రూ. 49,078 కోట్లు చెల్లించారు. రూ.53,894 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని భారత్ ఆదా చేసింది. అంతేకాకుండా 318 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలను తగ్గించడానికి ఈ చర్య దారితీసింది.
* చమురు దిగుమతులపై తగ్గనున్న ఖర్చు
2021-22 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతిపై భారతదేశం 120.7 బిలియన్ల డాలర్లు (దాదాపు రూ.వేయి కోట్లు)ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు) చమురు దిగుమతులపై ఇప్పటికే 125 బిలియన్లు డాలర్లు ఖర్చు చేసింది. రానున్న రోజుల్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కల్పడం ద్వారా ముడి చమురు దిగుమతులపై చేసే ఖర్చు భారీగా తగ్గనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, National News, Petrol, Pm modi