Parliament winter session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 17 రోజులు జరగనున్నాయి. డిసెంబర్ 29న ఇవి ముగియబోతున్నాయి. ఈ సమావేశాల్లో 25 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి నిన్న అఖిలపక్ష సమావేశం (All Party Meet) జరిగింది. శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఈ సందర్భంగా.. కొన్ని అంశాలను ప్రస్తావించిన ప్రతిపక్ష పార్టీలు.. వాటిపై చర్చ జరపాలని కేంద్రాన్ని కోరాయి. ఈసారి సమావేశాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... పార్లమెంట్ పాత భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే. నెక్ట్స్ సమావేశాల్ని పార్లమెంటు కొత్త భవనంలో జరపనున్నారు. అసలు.. ఈ సమావేశాల చివరి రోజులను కూడా కొత్త భవనంలో జరపాలని మొదట అనుకున్నా.. అలా వీలు కాకపోవచ్చని తెలుస్తోంది.
ఈ సమావేశాల్లో దేశ సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై సీనియర్ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న కీలక సమావేశం నిర్వహించారు. దేశ సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తి, కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. ఐతే.. భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఈ సమావేశాలకు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం ముందు సవాళ్లు :
ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఇందుకు దేశంలోని పరిస్థితులే కారణం. ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలువ తగ్గిపోతూ ఉండటం, ఉద్యోగాల కోతలు, సరిహద్దుల్లో సమస్యలు ఇలా ఎన్నో అంశాలున్నాయి. వాటిపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో.. కోవిడ్ నుంచి కోలుకొన్న దేశం.. ముందుకు పరుగులు పెట్టేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం కోరుతోంది. అందువల్ల సమావేశాలు ఆందోళనల మధ్య సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.