నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు తాము పండించిన ఉత్పత్తులను ఇకపై ఇతర రాష్ట్రాల్లోనూ అమ్ముకునే విధంగా చట్టంలో మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు నిత్యావసర వస్తువుల చట్టం 1955కు ప్రతిపాదించిన పలు కీలక సవరణలను ఆమోదించింది. దేశంలోని రైతులకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ... రైతులకు మాత్రం ఈ రోజే వచ్చిందని ఆయన అన్నారు. స్థానికంగా ఉండే వారు కొనుగోలు చేయకపోతే... తమ ఉత్పత్తులను ఏదో ఒక ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఉండేది.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితుల్లో మార్పు రానుంది. ధరల విషయంలో ఇంతకాలం వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మాత్రమే కాదు... వ్యవసాయ రంగానికే లాభం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక మార్కెట్ కమిటీలు రైతులకు మంచి ధర రావడానికి అడ్డంకిగా మారాయి. బయట అమ్ముకుంటే మంచి ధర వచ్చే అవకాశం ఉన్నా... కేవలం లైసెన్స్ ఉన్న దళారీలకు మాత్రమే తమ వస్తువులను అమ్ముకునేలా చేశాయి. అయితే ఈ కొత్త చట్టం కారణంగా రైతులు ఇతర రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించే వీలు కలుగుతుంది. యూపీ రైతులు ఈ ట్రెడింగ్ ద్వారా గుజరాత్లోనూ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. భారత్ ఒకే దేశం, ఒకే మార్కెట్ దశకు చేరుకుంటోందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.