Rising India Summit: న్యూ ఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’( Rising India Summit)మార్చి 29, బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కేంద్ర మంత్రులు సదస్సులో పాల్గొని మాట్లాడారు. నెట్వర్క్ 18(Network18), పూనావాలా ఫిన్కార్ప్(Poonawala fincorp) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith shah) మాట్లాడుతూ.. అనేక విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఐక్యత, విచారణ సంస్థల దుర్వినియోగం, 2024 సార్వత్రిక ఎన్నికలు, న్యాయ వ్యవస్థతో విభేదాలు.. వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అమిత్ షా తేల్చి చెప్పారు.
ఇటీవల కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య కొన్ని అంశాలపై ఘర్షణ వాతావరణం ఏర్పడిందనే ఊహాగానాల నడుమ, అమిత్ షా మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఎలాంటి వివాదం లేదు. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అవన్నీ విభేదాలు కావు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థతో ఎప్పుడూ ఘర్షణ ఉండదు. ఏ ప్రభుత్వమూ ఇలా చేయదు, చేయకూడదు. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగపరంగా నిర్వచించిన సరిహద్దులు ఉన్నాయి, ఆ వ్యవస్థలన్నీ ఆ పరిమితుల్లోనే పనిచేయాలి.’ అని అమిత్ షా చెప్పారు.Rising India Summit: శివసేన చీలిక ఆ పార్టీ విశ్వాసపాత్రులైన ఓటర్ల నిర్ణయం.. బీజేపీ ప్రమేయం లేదన్న షా
నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ (NJAC) ఇష్యూపై అమిత్ షా మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామకానికి కొత్త యంత్రాంగాన్ని (new mechanism) సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందని, దానిని సుప్రీం కోర్టు పరిశీలిస్తుందని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం ఒక SOPని కోర్టుకు పంపింది. దీన్ని త్వరితగతిన పరిగణనలోకి తీసుకోవడానికి చర్యలు చేపట్టాలని మాత్రమే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. ఇది వివాదం కాదు’ అని పేర్కొన్నారు.
కర్ణాటకలో మళ్లీ విజయం మాదే. యెడియూరప్ప సీనియారిటీని బీజేపీ ఎన్నడూ ప్రశ్నించలేదు- అమిత్ షా@AmitShah @poonawallafinco #News18RisingIndia https://t.co/xYsyRRIYrV
— News18 Telugu (@News18Telugu) March 29, 2023
ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం సుప్రీంకోర్టు స్టాప్-గ్యాప్ విధానాన్ని మాత్రమే రూపొందించిందని, ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలని కోరిందని చెప్పారు. ఇప్పుడు ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అమిత్ షా తెలిపారు.
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇస్తూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే, న్యాయవ్యవస్థను ఎవరు పట్టించుకుంటారని వ్యాఖ్యానించారు. ‘శాసన, న్యాయవ్యవస్థలు నిర్వహించాల్సిన విధులపై రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల బాధ్యతలపై లక్ష్మణ రేఖ స్పష్టంగా ఉంద’ని ఆయన పేర్కొన్నారు. దీంతో మరోసారి కేంద్రం, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణ నెలకొందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వాదనను అమిత్ షా కొట్టిపారేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.