న్యూస్ 18 నెట్వర్క్ నిర్వహిస్తున్న ‘రైజింగ్ ఇండియా సదస్సు 2023’లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో రోడ్ సేఫ్టీ; హైడ్రోజన్ బస్సుల(Hydrogen Bus) తయారీ గురించి వివరించారు. భారత ప్రజలకు చట్టం అంటే లెక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ రూల్స్(Road Safety Rules) పాటించకపోవడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన విన్నవించారు.
రూల్స్ని లెక్కచేయరు..
విదేశాల్లో వాహనదారులు పక్కాగా రూల్స్ పాటిస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ‘లేన్’ రూల్ని పాటిస్తూ ఒకే తోవలో వెళ్తారని, ఎవరైనా రోడ్డు దాటుతుంటే కాస్త దూరంగానే వాహనాన్ని నిలిపి వేస్తారని ఆయన గుర్తు చేశారు. కానీ, భారత్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు. అసలు ట్రాఫిక్స్ రూల్స్ని ఎవరూ సీరియస్గా తీసుకోరని ఆయన విమర్శించారు.
ఏటా 5 లక్షల ప్రమాదాలు..
‘రెడ్ సిగ్నల్ పడగానే ఆగకుండా వెళ్తారు. పైగా, హెల్మెట్ కూడా పెట్టుకోరు’ అంటూ కేంద్ర మంత్రి వాహన దారులపై విచారం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్య వైకరి కారణంగా ఏటా భారత్లో 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వీరిలో 1.5లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో 60శాతం 18-34 ఏళ్ల మధ్య వయసున్న వారేనని ఆయన గుర్తు చేశారు. రూల్స్ని పాటిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువగా భారత్లోనే ప్రమాదాలు జరగుతుండటం విషాదకరమని తెలిపారు. ప్రజలు రూల్స్ని సీరియస్గా పాటిస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
త్వరలోనే హైడ్రోజన్ బస్సు..
త్వరలోనే హైడ్రోజన్ బస్సు రోడ్డుపైకి రానుందని నితిన్ గడ్కరీ గుడ్న్యూస్ చెప్పారు. విమానాల్లో ఇంధనంగా కూడా హైడ్రోజన్ వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఎనర్జీ విభాగంలో దిగుమతి దారుగా కాకుండా ఎగుమతి దారుగా అవతరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ హైడ్రోజన్ వెహికల్స్పై ఫోకస్ పెట్టిందని చెప్పారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సులను త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు.
Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్
‘శివసేన మాతోనే ఉంది..ఉద్దవ్ సొంత పార్టీని విడిచిపెట్టాడు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్లో పీయూష్ గోయల్
హైడ్రోజన్ కారులో సమ్మిట్కి..
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారులో న్యూస్ 18 సమ్మిట్కి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వివరించారు. హైడ్రోజన్లో బ్రౌన్, బ్లాక్, గ్రీన్ అనే మూడు రకాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. కరెంట్ అవసరం లేకుండా బయో వేస్ట్తో గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసే ప్రక్రియను బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కనుగొన్నట్లు గడ్కరీ చెప్పారు. దీంతో చెత్త, మురుగు నీటితో గ్రీన్ హైడ్రోజన్ తయారీ చేయాలని చూస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వాహనాలతో ప్రయాణ ఖర్చు తగ్గిపోతుందని చెప్పారు.
అమెరికాకు ఎగుమతి..
నీటి నుంచి హైడ్రోజన్ని వేరు చేసే ఎలక్ట్రోలైజర్ల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. వీటిని అమెరికా వంటి బడా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గర్వంగా చెప్పారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ ఈ వేడుకకు ఆతిథ్యం ఇస్తోంది. నితిన్ గడ్కరీతో పాటు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జైశంకర్, పీయూష్ గోయల్ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. రేపు కూడా సదస్సు కొనసాగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nitin Gadkari