కార్మిక చట్టాల్లో (new wage code 2021) మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నూతన వేతన కోడ్ను రూపొందించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం, ఉద్యోగుల పని వేళలు 9 గంటల నుంచి 12 గంటల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే వారానికి 3 రోజుల సెలవు ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఒక ఉద్యోగి లేదా కార్మికుడు వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. గత నిబంధనల ప్రకారం, ఉద్యోగి 9 గంటలు పనిచేస్తే.. వారికి వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాల్సి ఉండేది. తాజా నిబంధనల ప్రకారం రోజుకు 12 గంటలు పని చేస్తే, వారంలో 3 రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త వేతన కోడ్ ముసాయిదాలో పేర్కొంది. ప్రస్తుతం సంవత్సరానికి 300 రోజుల పని దినాలు ఉండగా.. వేతన కోడ్ అమల్లోకి వస్తే ఇది 240 రోజులకు చేరనుంది. మరోవైపు, నూతన చట్టాల ప్రకారం పనివేళలతో పాటు టేక్ హోమ్ శాలరీలో మార్పులు రానున్నాయి.
ప్రస్తుతం ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గి.. పీఎఫ్ పెరుగుతుంది. ప్రస్తుతానికి నెలవారీ జీతం తగ్గినప్పటికీ.. గ్రాట్యుటీ, పీఎఫ్ కాంట్రిబూషన్ పెరగడంతో ఉద్యోగ విరమణ తర్వాత అందుకునే డబ్బు కూడా పెరగనుంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఈ నిధి మీకు అండగా ఉంటుంది. అయితే, పీఎఫ్, గ్రాట్యుటీ పెరుగుదలతో కంపెనీల ఖర్చు కూడా పెరుగుతుంది. ఎందుకంటే, వారు ఉద్యోగుల కోసం పీఎఫ్కు ఎక్కువ సహకారం అందించాల్సి ఉంటుంది. ఈ విషయాలు కంపెనీల బ్యాలెన్స్ షీట్ మీద ప్రభావం చూపిస్తాయి.
తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ..
నూతన వేతన చట్టాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా లేకపోవడంతో అవి వాయిదా పడ్డాయి. అయితే ఈ నిబంధనలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నాలుగు ముఖ్యమైన వేతన కోడ్లను కార్మిక మంత్రిత్వ శాఖ రూపొందించింది. చాలా రాష్ట్రాలు వీటిని అమలు చేయడానికి సిద్దమవుతుండగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ సొంత వేతన కోడ్లు అమలు చేస్తున్నందున కొత్త వేతన కోడ్ను అమలు చేసే పరిస్థితులు లేవని చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.