కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు ప్రజల్లో అవగాహన లేమీ కూడా ఓ కారణం. నీటి సంరక్షణ, ప్రతి నీటి బొట్టును కాపాడుకోవడమే లక్ష్యంగా న్యూస్ 18 మిషన్ పానీ అనే అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా న్యూస్ 18, హార్పిక్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన మిషన్ పానీ వాటర్థాన్ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. దేశంలో నీటి సంక్షోభం ఉందని.. నీటి కొరత లేదని అన్నారు.
మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతంలో నీరు లేకపోవడం అనే సమస్యను ఏ రకంగా అధిగమించామనే అంశాన్ని గడ్కరీ వివరించారు. బుల్దానా మోడల్ ద్వారా మహారాష్ట్రలోని 152 గ్రామాల్లో నీటి సమస్యను తీర్చామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో మట్టిని జాతీయ రహదారుల నిర్మాణం కోసం తీసుకున్నామని.. నీటి సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. బుల్దానాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఈ కారణంగానే నీటి లభ్యత తక్కువగా ఉంటుందని గడ్కరీ తెలిపారు.
అయితే ఈ విధానం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి 2019లో 152 గ్రామాలకు నీటి సమస్య తీరిందని అన్నారు. ఈ విధానం ద్వారా మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండే విదర్భ వంటి ప్రాంతాల్లోనూ నీటి సమస్యను తీర్చవచ్చని గడ్కరీ అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణ కోసం అవగాహన కల్పించే కార్యక్రమాల అవసరం ఎంతో ఉందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani, Nitin Gadkari