గుజరాత్లో 26 లోక్ సభ స్థానాలున్నాయి. వాటిలో గెలిచేందుకు 370 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్లలో ఏ ఒకరో, ఇద్దరికో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయంటే... అది సహజమే, ఆ మాత్రం ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఈసారి 370 మందిలో ఏకంగా 58 మందిపై కేసులు నమోదై ఉండటం ఆందోళన కలిగించే అంశం. మొత్తం అభ్యర్థుల్లో వీళ్ల సంఖ్య 16 శాతానికి పైనే. ఇక ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే... పారిపాలన ఏం చేస్తారు. గుజరాత్ని సర్వనాశనం చేస్తారు. ఇప్పటివరకూ ఆ రాష్ట్రానికి వైబ్రంట్ గుజరాత్ అనే మంచి పేరుంది. నేర చరిత్ర ఉన్న నేతల వల్ల ఆ రాష్ట్ర అభివృద్ధి అటకెక్కే ప్రమాదం ఉంది. ఆ 58 మందిలో 34 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. హత్య కేసులు, హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. గుజరాత్లో ఈనెల 23న తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి.
అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలదీ అదే తీరు. నేర చరిత్ర ఉన్నవాళ్లకు టికెట్ ఇవ్వకుండా చెయ్యాల్సిన పార్టీలు... టికెట్లు ఇచ్చేస్తుంటే... వాళ్లు ఇష్టారాజ్యంగా నల్లధనాన్ని ఖర్చుపెట్టి... అధికారంలోకి వస్తున్నారు. ఆ తర్వాత అధికార బలంతో... తమపై కేసుల్ని మాఫీ చేయించుకొని... తిరిగి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈసారి 58 మందిలో 34 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. కాంగ్రెస్ జాబితాలో 9 మంది, బీజేపీ నుంచీ ఐదుగురు అభ్యర్థులుు నేరాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎవరో ఎందుకు... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.... గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై నేరపూరిత బెదిరింపులు, అల్లర్లు, వివిధ గ్రూపుల మధ్య తగాదాల్ని సృష్టించడం ద్వారా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి 4 కేసులున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగదన్న విమర్శలున్నాయి.
ఇక భారతీయ ట్రైబల్ పార్టీ అభ్యర్థి, పార్టీ అధ్యక్షుడు చోటూ వాసవ, ఆయన ప్రత్యర్థి, బహరుచ్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి షేర్ఖాన్ పఠాన్ హత్య కేసును ఎదుర్కొంటున్నారు. సురేందర్నగర్ నుంచీ పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి భగవాన్ గోల్తార్, రాజ్కోట్ నుంచీ బహుజన్ ఎస్పీ తరఫున బరిలో దిగిన విజయ్ పర్మార్ కూడా హత్య, హత్యాయత్నం, దౌర్జన్యం వంటి కేసుల్ని ఎదుర్కొంటున్నారు. జునాగథ్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి అమృత్భాయ్ కరియాపై అతి ఎక్కువగా 11 సీరియస్ కేసులున్నాయి. ఆయన గెలిస్తే, మరిన్ని హత్యలు జరగవన్న గ్యారెంటీ ఉందా...
ఆనంద్ నుంచి గెలుస్తానంటున్న బీజేపీ అభ్యర్థి మితేష్ పాటిల్పై 9 కేసులున్నాయి. రాజ్కోట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పర్వీన్ డెంగడపై 6 తీవ్ర నేరాల కేసులున్నాయి. సురేందర్నగర్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి భూపతి సోలంకిపై 6 కేసులు రికార్డై ఉన్నాయి. అహమ్మదాబాద్ తూర్పు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న గీతాబెన్ పటేల్పై 5 కేసులున్నాయి. రాజ్కోట కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ కగాతార లంచం, ఎన్నికల్లో నిధుల అక్రమ పంపకాలు వంటి కేసుల్లో దర్యాప్తు సాగుతోంది.
ఇలా నేర ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు... రేపు అధికారంలోకి వస్తే, ప్రజా సేవ ఎందుకు చేస్తారు. కచ్చితంగా మరిన్ని నేరాలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.