కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 2017-2018 బ్యాచ్లో ప్రభుత్వ కోటా సీట్ల ద్వారా చేరిన విద్యార్థులను గత నాలుగు రోజులుగా ఇంటర్న్షిప్ తరగతులకు అనుమతించడం లేదు. ఇంటర్న్షిప్ తరగతులకు హాజరు కావాలనుకుంటే, సంవత్సరానికి రూ. 1.62 లక్షల చొప్పున, మొత్తంగా రూ.8.10 లక్షలు అదనపు రుసుము చెల్లించాలని విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. కాగా, మెడికల్ డిగ్రీ పొందాలంటే ఇంటర్న్షిప్ తప్పనిసరి. ప్రభుత్వ కోటాలో సదరు మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందిన విద్యార్థులు 35 మంది. వీరంతా ఇప్పటికే సంవత్సరానికి రూ. 3.13 లక్షలతో పాటు ఇతర ఫీజుల కింద అదనంగా మరో రూ.50,000 చెల్లించారు.
మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ తరగతులు జులై 25న ప్రారంభమయ్యాయి. వన్ ఇయర్ ఇంటర్న్షిప్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటర్న్షిప్ను జులై 31, 2023 లోపు పూర్తి చేస్తేనే నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులను ఇంటర్న్షిప్కు అనమతించకపోవడం పట్ల వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై 31లోగా ఇంటర్న్షిప్ కు అనుమతించకపోతే విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోతారని వారు వాపోయారు. ఈ ఘటనపై చర్చించడానికి కాలేజీ యాజమాన్యాన్ని కోరినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
పుదుచ్చేరి యూటీ ఆల్ సెంటాక్ స్టూడెంట్ పేరెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.నారాయణసామి మాట్లాడూతూ... ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జులై 28న ఆరోగ్య కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటర్న్షిప్కు సమయం మించిపోతుండడంతో వీరిలో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే ఫీజు చెల్లించారు. మరికొంత మంది ప్రభుత్వ చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు.. కరోనా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా విదేశీ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE)లో పాల్గొనేందుకు ఎట్టకేలకు అనుమతించారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(NMC) అధికారిక నోటీస్ జారీ చేసింది.
‘‘అండర్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ విద్యార్థులు జూన్ 30, 2022లోపు తమ కోర్సు పూర్తి చేసిన వారికి సంబంధింత ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫికెట్ మంజూరు అవుతుంది. వారు FMG పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తాం. విదేశీ ఇన్స్టిట్యూట్లలో అండర్గ్రాడ్యుయేట్ మెడిసిన్ కోర్సులో భాగంగా క్లినికల్ శిక్షణకు హాజరుకాని విద్యార్థులు, భారతదేశంలో రెండు సంవత్సరాల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (CRMI) చేయాల్సి ఉంటుంది.’’ అని ఎన్ఎంసీ పేర్కొంది. కాగా, భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే FMGE పరీక్ష తప్పనిసరి.
.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Medical college, Medical study, Medicine