అసలే అగ్రనేతల మరణంతో కుంగిపోయిన మావోయిస్టు పార్టీకి అతి భారీ షాకిస్తూ మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 26 మంది నక్సల్స్ ను ఎన్ కౌంటర్ లో హతం చేశారు. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం 26 మంది మావోయిస్టులు మరణించారు. చనిపోయినవారిలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్ గఢ్(ఎంఎంసీ) జోన్లో మావోయిస్టుల రిక్రూట్మెంట్లు, విస్తరణ బాధ్యతలు చూస్తున్న మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ జీవా అలియాస్ దీపక్ తేల్తుంబ్డేతోపాటు కీలక నేతలు, మహిళలూ ఉన్నారు. సంచలనం రేపిన ఈ ఎన్ కౌంటర్ ఘటనపై మావోయిస్టు పార్టీ తొలిసారిగా స్పందించింది. వివరాలివి..
మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రికొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్ కమిటీ పేరుతో ఈ మేరకు ఆదివారం ఓ లేఖను విడుదల చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేవ్ రాష్ట్రాలు సమన్వయంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
మావోయిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని మవోలు లేఖలో మండపడ్డారు. గడ్చిరోలి గ్యారపట్టి ఎన్కౌంటర్కు కేంద్రంతోపాటు 3 రాష్ట్రాలు బాధ్యత వహించాలని మావోయిస్టులు పేర్కొన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్పట్టి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ నిదానంగా సాగుతోంది. మృతుల్లో ఆరుగురు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. కొందరి వివరాలను పోలీస్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆరుగురు మహిళలు సహా 26మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ దీపక్, డీవీసీఎం మహేష్ గోటా, డీవీసీఎం లోకేష్ మడకం, మిలింద్ బాడీగార్డులు కిషన్, భగత్ లు మృతిచెందిన మావోయిస్టుల్లో ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. గుర్తించినవారి మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Encounter, Maharashtra, Maoist, Maoists