అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచి విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మొగల్ వంశస్తుడిగా చెప్పుకుంటున్న హబీబుద్దీన్ టుసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదాస్పద స్థలానికి నిజమైన హక్కుదారుడిగా తనను గుర్తించాలని సుప్రీంకోర్టును కోరాడు. అలా జరిగితే రామాలయ నిర్మాణానికి తానే మొదటి బంగారు ఇటుకను ఇస్తానని వెల్లడించాడు.
రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం కేసులో తన పేరునూ చేర్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు టుసీ. ఐతే ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. వివాదాస్పద భూమికి నిజమైన హక్కుదారులమని ఇప్పటి వరకు ఎవరూ నిరూపించుకోలేకపోయారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే తననే నిజమైన హక్కుదారుడిగా గుర్తించాలని కోరుతున్నారు.
50 ఏళ్ల హబీబుద్దీన్ టుసీ ఇప్పటికే మూడు సార్లు అయోధ్యను సందర్శించారు. గత ఏడాది అయోధ్యకు వెళ్లిన ఆయన.. రామమందిరం నిర్మాణానికి భూమిని అప్పగిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తన తలపై రాముడి పాదముద్రలను పెట్టుకొని రాముడి ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు హిందువులకు క్షమాపణలు చెప్పారు టుసీ. కాగా, సుప్రీంకోర్టులో రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై విచారణ జరుగుతున్న వేళ టుసీ ఈ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.