లోక్సభ ఎన్నికలకు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నాలుగు రోజుల్లో ఆ పార్టీకి చెందిన 23 మంది నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశించి భంగపడగిన నేతలు పార్టీని వీడారు. ఈనెల 19న బీజేపీకి చెందిన ముగ్గురు నేతలు కాంగ్రెస్లో చేరారు. త్రిపుర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబాల్ భౌమిక్ వారిలో ఒకరు. మాజీ మంత్రి ప్రకాష్ దాస్, ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరున్న దేబాషిష్ సేన్ పార్టీని వీడారు. ‘అయిపోయిందేదే అయిపోయింది’ అని భౌమిక్ తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. త్రిపురలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11, ఏప్రిల్ 18న త్రిపురలో పోలింగ్ నిర్వహిస్తారు.
ఇక అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్రం నుంచి 20 మంది బీజేపీ నేతలు పార్టీని వీడారు. అందులో ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండడం కమలనాధులకు మింగుడుపడని అంశం. వారంతా కె.సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్లో చేరారు. కొత్తగా ఎమ్మెల్యేల చేరికతో అరుణాచల్ అసెంబ్లీలో ఎన్పీపీ బలం 13కు చేరింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నేతలకు టికెట్ నిరాకరించడం వల్లే వారంతా పార్టీ మారారు. అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్లో ఎన్పీపీ భాగం. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ మేఘాలయలో అధికారంలో ఉంది. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ. నాగాలాండ్లోని ఎన్డీపీపీ ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంది.