క్షణికావేశంలో యువత దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని ఉసురు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రేమ విఫలయిందన్న కారణాలతోనూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ప్రేయసి ఆత్మహత్య చేసుకుందని తెలిసి గల్ఫ్ దేశానికి ఉపాధికి వెళ్లిన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన కోసమే ఆమె ప్రాణాలు వదిలిందనీ, తనకు అన్యాయం చేయలేనంటూ వీడియో రికార్డ్ చేసి మరీ ఆ కుర్రాడు ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ప్రియుడి మరణ వార్త తెలిసి అతడి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిందో ప్రేయసి. ప్రియుడు మరణించిన మూడు రోజుల తర్వాత అతడి ఇంటి వద్దే ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లా చిక్కనాయకహళ్లిలోని మారుతి నగర్ కు చెందిన దీక్షిత్, మండ్య జిల్లా ముద్దూరు పరిధిలోని కొప్ప గ్రామానికి చెందిన పంచాక్షరి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. దీక్షిత్ దాసరహళ్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లికి ఇంట్లో ఒప్పిస్తానని చెప్పి స్వగ్రామానికి వెళ్లాడు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. దీంతో మనస్థాపం చెందిన దీక్షిత్ ఫిబ్రవరి 7న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
దీక్షిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం పంచాక్షరికి ఆలస్యంగా తెలిసింది. అతడి ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. చిక్కనాయకహళ్లిలోని మారుతి నగర్ లో దీక్షిత్ ఇంటిని గుర్తించింది. అయితే ఆ తర్వాత ఏమయిందో ఏమో కానీ, బుధవారం దీక్షిత్ ఇంటికి దగ్గరలోనే ఓ చెట్టుకు ఉరి వేసుకుని పంచాక్షరి చనిపోయింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదనీ, హత్యేనని ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Karnataka, Love marriage, Lovers suicide