లోక్ సభ ఎన్నికలు చివరికి వచ్చేశాయి. నేడు 7 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో... అంటే ఉత్తరప్రదేశ్-13 సీట్లు, పంజాబ్-13 , పశ్చిమ బెంగాల్-9, బీహార్-8, మధ్యప్రదేశ్-8, హిమాచల్ ప్రదేశ్-4, జార్ఖండ్-3, ఛండీగఢ్-1 స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఏడో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో 918 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు. ఏడు దశల పోలింగ్కు సంబంధించి మే 23న ఫలితాలు రానున్నాయి. ఈలోపు ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై న్యూస్18 లైవ్ అప్డేట్స్ అందిస్తుంది. ఏడో దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి రెండోసారి ఎన్నికల బరిలో ఉన్నారు.
ఎన్డీఏకు మెజారిటీ లభించి మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారా లేక కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్నది మే 23న తెలిసే అవకాశాలున్నాయి. ఫలితాలు వచ్చాక రెండు, మూడు రోజుల్లో ప్రధాన మంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతోపాటూ... జూన్ మొదటి వారంలో కొత్త పార్లమెంటు ఏర్పాటవుతుంది.
7వ దశలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో వచ్చిన దానికంటే అధిక మెజారిటీతో గెలుస్తారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్... మోదీపై పోటీ చేశారు. ఈసారి ప్రముఖులెవరూ మోదీపై పోటీ చేయట్లేదు. కాంగ్రెస్ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయిన అజయ్ రాయ్ మాత్రం మోదీపై పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ తరపున శాలినీ యాదవ్ బరిలో ఉన్నారు. మొత్తం 26 మంది అభ్యర్థులు మోదీని ఓడిస్తామంటున్నారు.
ఏడో దశలో ప్రముఖులు వీరే : లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, బీజేపీ నేత కిరణ్ఖేర్, సినీ నటుడు సన్నీ డియోల్, రవి కిషన్, కాంగ్రెస్ నాయకులు శత్రుఘ్నసిన్హా, మనీష్ తివారీ శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత ప్రొఫెసర్ ప్రేమ్సింగ్ చందుమాజ్రా, సుఖ్బీర్ బాదల్, JMM నేత శిబూ సోరెన్ బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులైన మనోజ్ సిన్హా, రవిశంకర్ ప్రసాద్, హర్సిమ్రత్ కౌర్ బాదల్, హర్దీప్సింగ్ పురి ఫ్యూచర్ ఈ దశలో తేలుతుంది.
ఇవి కూడా చదవండి :
ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...
రూ.10 నాణేనికి ఓ దండం... వద్దంటున్న ప్రజలు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Election 2019, Madya pradesh, Narendra modi, Uttar pradesh, Varanasi S24p77, West Bengal