ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన, దేశంలో నిరసనలకు దారితీసిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ (Lakhimpur Kheri violence case) ఘటన అనంతర పరిణామాల్లో సంచలన మలుపు చోటుచేసుకుంది. రైతుల్ని జీపుతో తొక్కి చంపిన కేసులో ముద్దాయి అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. లఖీంపూర్ హింస కేసులో అలహాబాద్ హైకోర్టు ఆశిష్ మిశ్రాకు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. (Ashish Misra bail cancelled) వారంలోగా లోంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చింది. వివరాలివే..
లఖీంపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు చనిపోయిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను సీజేఐ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ రద్దు చేసింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెడుతూ ఈ సందర్భంగా సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
‘హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించింది’ అని సీజేఐ రమణ బెంచ్ తీవ్ర వ్యాఖ్యానం చేసింది. ‘హైకోర్టు అనేక అసంబద్ధమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదు’ అని బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
గతేడాది అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కీలక నిందితుడు. అక్టోబరు 9వతేదీన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరైంది. రైతులను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందని సిట్ గతంలోనే తేల్చింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయగా, ప్రస్తుతం ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసి, వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Farmers, Farmers Protest, Supreme Court, Uttar pradesh