Heavy rain batters Kerala : భారీ వర్షాలు పడితే చాలు... కేరళ మునిగిపోతోంది. మరోసారి అదే పరిస్థితి. వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకొని... ఇప్పటికే 25 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కేరళ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తమైన పినరయ్ విజయన్ ప్రభుత్వం... తెల్లారే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి... అప్రమత్తంగా ఉండాలని అందర్నీ ఆదేశించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అలాగే జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాల్లో తలమునకలయ్యాయి. మలప్పురం, వాయనాడ్ జిల్లాల్లో స్కూళ్లతోపాటూ... కాలేజీలూ మూసివేశారు.
చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో... మెప్పాడీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఓ ఆలయం, ఓ చర్చి, కొన్ని ఇళ్లు, వాహనాలపై కొండరాళ్లు పడినట్లు తెలిసింది. ఎంత మంది మిస్సింగ్ అయ్యారో కూడా తెలియట్లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 22,165 మంది బాధితులను ప్రభుత్వ రిలీఫ్ క్యాంప్లకు తరలించారు.
గతేడాది కేరళలో వరదలు వచ్చి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటం కలవరం కలిగిస్తోంది. కేరళతోపాటూ... పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
మరోవైపు కర్ణాటకలో భారీ వర్షాలతో... శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. రిజర్వాయర్ సామర్ధ్యం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 879 అడుగులకు చేరుకుంది. రెండ్రోజుల తర్వాత నిండుతుందని అనుకుంటే... ముందుగానే నిండిపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గేట్లు తెరచి నీటిని వదిలేందుకు సిద్ధమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Karnataka, Kerala floods, Kerala rains, Maharashtra, Rain, Rains