ఇండియాలో చాలా కాలంగా రగులుతోన్న సమస్య ఇది.. ఇటీవల సుప్రీంకోర్టు సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఒక విషయం పట్ల పౌరులకు నిరసనలు చేసే హక్కు ఎంతుందో.. ఇతరకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పును చదివాడో లేదోగానీ, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్.. తాను వెళుతోన్న దారిలో నిరసనల్ని వ్యతిరేకించి పాపం దెబ్బలు తిన్నాడు. కేరళలో కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
అంతరిక్షాన్ని కూడా దాటేస్తాయా అన్నంత పైపైకి పోతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం కొచ్చిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎడపల్లి-వైటిల్లా జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. అదే సమయంలో కారులో అటుగా వెళుతోన్న మలయాళ నటుడు జోజు జార్జ్ ట్రాఫిక్ లో చిక్కకుపోయారు. రోడ్ క్లియర్ అవుతుందేమోనని ఎంత సేపు ఎదురుచూసినా ఫలితం లేకపోయేసరికి జొజు సహనం కోల్పోయి కారు దిగాడు..
ప్రజల తరఫున చేసే నిరసనలల్లో ప్రజల్నే ఇబ్బంది పెట్టడమేంటంటూ జోజు జార్జ్ కాంగ్రెస్ కార్యకర్తలతో వాదులాటకు దిగారు. నిరసన ముగించాలని కోరాడు. నటుడి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు.. జోజును తోసిపారేసి, ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. తనపై దాడి జరిగిందంటూ నటుడు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ వాదన మాత్రం మరోలా ఉంది..
నటుడు జోజునే మద్యం మత్తులో ఊగిపోయారని, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. నటుడిపై పోలీసులకు రివర్స్ ఫిర్యాదు కూడా చేశారు. జోజు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనను వైద్య పరీక్షలకు పంపారు. కారు అద్దాలు బద్దలుగొట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యపరీక్షల రిపోర్టులు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తర్వాత తుదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఉదంతంలో తప్పు ఎవరిది? అనే చర్చ జరుగుతోంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Malayalam, Petrol Price