దేశవ్యాప్తంగా లేదా ప్రత్యేక ప్రాంతంలో లేదా సముదాయాల మధ్య ఉద్రిక్తలు, తీవ్ర గొడవలు, వాగ్వాదాలకు దారితీసిన సున్నితమైన అంశాల్లో ఇటీవల కోర్టులు చెబుతోన్న తీర్పులపై బాహాటంగా విమర్శలు వెల్లువెత్తుతుండటం.. చిన్న స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా, జిల్లా జడ్జిల నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) దాకా న్యాయమూర్తులపైనా ట్రోలింగ్స్ జరుగుతుండటం.. కోర్టు-న్యాయ వ్యవహారాలపై మీడియాలోనే విచారణలు, తీర్పుల డ్రామాలు చోటుచేసుకొంటున్న పరిణామాలపై భారత ప్రధాన న్యయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI Ramana) ఘాటుగా స్పందించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలకమైన అంశాల్లో తనదైన మార్కు చూపిస్తోన్న ఆయన ప్రస్తుత మీడియా పోకడలపై (Kangaroo Courts by Media) సునిశిత విమర్శలు చేశారు.
దేశంలో ఎలక్ట్రానిక్ (టీవీ) మీడియా, సోషల్ మీడియా తీరుతెన్నులపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జస్టిస్ సత్య బ్రతా సిన్హా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభ ఉపన్యాసమిస్తూ.. మీడియా కోర్టులను నడిపిస్తోందని ( ఇంగ్లీష్ లో Kangaroo Courts by Media) ఆరోపించారు. కొన్ని కేసుల్లో అనుభవజ్ఞులైన జడ్జిలు కూడా ఇవ్వలేని తీర్పులను కూడా మీడియా సులువుగా ఇచ్చేస్తోందని, అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని రమణ ఆక్షేపిస్తారు.
అతి దూకుడు, బాధ్యతారాహిత్యం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకువెళ్తున్నట్లు మీడియాపై చీఫ్ జస్టిస్ సీరియస్ అయ్యారు. ప్రింట్ మీడియా ఇంకా కాస్త జవాబుదారీగా వ్యవహరిస్తోందని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జవాబుదారీతనంతో ఉందని ఎన్వీ రమణ అన్నారు. ఇటీవల కాలంలో న్యాయమూర్తులపై భౌతికదాడులు పెరుగుతున్నాయని, ఎటువంటి రక్షణ లేకుండానే జడ్జిలు సమాజంలో జీవించాల్సి వస్తోందన్నారు.
రాజకీయవేత్తలు, అధికారులు, పోలీసు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు రిటైర్మెంట్ తర్వాత కూడా సెక్యూర్టీ కల్పిస్తున్నారని, కానీ జడ్జిలకు ఇదే తరహా రక్షణ లేకుండాపోయిందని వాపోయారు సీజేఐ రమణ. నిర్ణయాత్మక కేసుల్లో మీడియా విచారణ సరైంది కాదని, బేధాభిప్రాయాలను ప్రచారం చేస్తున్న మీడియా.. ప్రజల్లో వైరుధ్యాన్ని పెంచుతోందని, తద్వారా ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, ఈక్రమంలో వ్యవస్థలు దెబ్బతింటున్నాయని, మొత్తంగా న్యాయవ్యవస్థపై పెను ప్రభావం పడుతోందని ఉన్నత న్యాయమూర్తి అన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా సంగతి ఇలా ఉంటే, సోషల్ మీడియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని సీజేఐ రమణ అభిప్రాయపడ్డారు. స్వీయ నియంత్రణతో మీడియా ఉండాలని కోరిన ఆయన.. మీడియా తాను వాడే పదాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలను విద్యావంతులను చేసేందుకు, చైతన్యపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తన గళాన్ని వాడుకోవాలని సీజే రమణ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NV Ramana, Social Media, Supreme Court, TV channels