(హజారి-కవి, రచయిత)
అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే 39వ విశ్వ కవి సమ్మేళనం గాంధీ జయంతి నాడు ఒడిసాలోని భువనేశ్వర్లో వైభవంగా జరిగింది. ఐదు రోజులపాటు కళింగ సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రపంచ సాహిత్య ఉత్సవాలు కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ (కేఐఐటీ) వేదికగా జరుగుతున్నాయి. తొలిరోజు కార్యక్రమాలను ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించగా.. 82 దేశాలనుంచి 1300 మంది కవులు ఈ ప్రపంచ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కేఐఐటీ సంస్థల వ్యవస్థాపకుడు, ఎంపీ ప్రొఫెసర్ అచ్యుతా సామంత మాట్లాడుతూ.. మనదేశంలో మూడవసారి జరుగుతున్న విశ్వ కవి సమ్మేళనం కళింగ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం కలగడం తనకు గర్వకారణమని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో తెలంగాణ కవి సిద్దార్థ రచించిన ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్(మల్లెల తీర్థం)ను ఆవిష్కరించారు. ఈ సంపుటిపై కార్యక్రమంలో పాల్గొన్న వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్రి అధ్యక్షుడు డాక్టర్ మారిస్ యంగ్ మాట్లాడుతూ.. కరుణ ప్రధానంగా సాగిన జాస్మిన్ వాటర్ కవితా సంపుటి ప్రపంచ పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నూతన కవులకు ఎంతో ప్రోత్సాహకంగా వుంటుందని తెలిపారు.
ప్రపంచశాంతి దిశగా కవిత్వం పయనించాల్సిన అవసరాన్ని విశ్వకవి సమ్మేళనం చాటిచెబుతోందని మారిస్ యంగ్ అన్నారు. భారత్లో ప్రతిభామంతులైన కవులకు కొదవలేదని, గతంలో రెండుసార్లు ఇక్కడ సమ్మేళనం నిర్వహించామని చెప్పారు. నాటి సభలకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారన్న యంగ్, కలామ్ రెండు పుస్తకాలను తాను చైనీస్లోకి అనువాదం చేశానని చెన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కాగా, వేడుకల్లో ఆఫ్రికా, ఫ్రాన్స్, మంగోలియా, జపాన్, చైనా తదితర దేశాల యువ కవులు ఎంతో మంది పాల్గొని తమ కవితలను సొంత భాషలో, ఇంగ్లిష్ అనువాదాల్లో వినిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha