news18-telugu
Updated: August 3, 2020, 9:53 PM IST
ప్రతీతాత్మక చిత్రం
జమ్ముకశ్మీర్లో బక్రీద్ రోజైన ఆదివారం సాయంత్రం కనిపించకుండా పోయిన భారత సైనికుడు ఉగ్రవాదులు అపహరించినట్లు అనుమానిస్తున్నారు. భారత ఆర్మీలోని 162 బెటాలియన్(టీఏ)లో షకీర్ మన్సూర్ రైఫిల్మన్గా పనిచేస్తున్నారు. సోపియాన్లోని తన కుటుంబీకులతో కలిసి బక్రీద్ పండుగను జరుపుకునేందుకు సెలవులు తీసుకుని ఇంటికి వెళ్లాడు. బక్రీద్ రోజైన ఆదివారం సాయంత్రం తన కుటుంబీకులతో కలిసి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుల్గాం ప్రాంతంలో అతని కారు దగ్ధమై ఉండటాన్ని గుర్తించారు. 24 గం.లు గడిచినా అతని ఆచూకీ కనిపించకపోవడంతో షకీర్ మన్సూర్ను ఉగ్రవాదులే అపహరించి ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. అతని కోసం ముమ్మర గాలింపు భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. సోపియాన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాల్లో భారత భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాలింపు చర్యల్లో స్థానిక పోలీసులు డ్రోన్స్, జాగిలాలను కూడా వినియోగిస్తున్నారు. షకీర్ మన్సూర్ ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని అతని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఆర్మీ జవాను షకీర్ మన్సూర్ ఆదివారం సాయంత్రం 5 గం.ల నుంచి కనిపించడం లేదని ఆర్మీ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. కుల్గాం వద్ద దగ్ధమైన అతని కారును గుర్తించినట్లు తెలిపారు. తీవ్రవాదులు అతన్ని అపహరించి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తమ ప్రకటనలో వెల్లడించారు. అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
Published by:
Janardhan V
First published:
August 3, 2020, 9:05 PM IST