మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మేగజైన్ ప్రకటించిన గత శతాబ్దపు అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాలో ఆమెకు చోటుదక్కింది. ఇందిరాగాంధీతో పాటు స్వాతంత్ర్య సమరయోధురాలు అమృత్కౌర్ని కూడా శక్తివంతమైన మహిళల జాబితాలో టైమ్ మేగజైన్ చేర్చింది. టైమ్ ప్రకటించిన వంద మంది జాబితాలో భారత్ నుంచి వీరిద్దరికి మాత్రమే చోటుదక్కింది. 1947 ఏడాదిగానూ అమృత్ కౌర్ను, 1976 ఏడాదికి గానూ ఇందిరా గాంధీని ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది.
టైమ్ శతాబ్దపు శక్తివంతమైన మహళల జాబితాలో మిచెల్లీ ఒబామా, హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో, ప్రిన్సెస్ డయానా, చైనాకు చెందిన ఫార్మా కెమిస్ట్ యూయో, డిజైనర్ కోకో చానెల్, జపాన్ మహిళ సడాకో ఒగాటో తదితరులు ఉన్నారు.
భారత ప్రధానిగా పనిచేసిన ఇందిరా గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 48వ ఏటా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నో సవాళ్లను ఆమె సాహసంతో ఎదుర్కొన్నారు. నెహ్రూ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు, లాల్బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణంతో తలెత్తిన నాయకత్వ సమస్యను తన శక్తియుక్తులు, ప్రతిభా పాటవాలతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
ఇక స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్.. పంజాబ్లోని కపుర్తాలాలో రాచకుటుంబంలో జన్మించారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభాస్యం తర్వాత 1918లో స్వదేశానికి తిరిగొచ్చి మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన బాటలోనే వలస పాలన, సామాజిక దురాచారాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఎంతో కృషిరేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి తర్వాత పదేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు అమృత్ కౌర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indira Gandhi, Women's day