INDIAN ARMY BUILD A HOSPITAL WITH 100 OXYGEN BEDS IN JUST 3 HOURS IN RAJASTHAN FOR COVID 19 PATIENTS NK
Indian Army: 3 గంటల్లో 100 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి సిద్ధం. ఇండియన్ ఆర్మీ చేసిన అద్భుతం
3 గంటల్లో 100 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి సిద్ధం (ప్రతీకాత్మక చిత్రం - credit - twitter)
Indian Army: యుద్ధాలు జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీ... ఆఘమేఘాలపై తాత్కాలిక ఆస్పత్రులను వార్జోన్లోనే నిర్మిస్తుంది. ఇప్పుడు కరోనా సందర్భంగా అలాంటిదే చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Indian Army: మూడు గంటల్లో మనం ఏం చెయ్యగలం... ఇండియన్ ఆర్మీ అయితే... ఓ ఆస్పత్రిని నిర్మించగలదు. అది కూడా ఆక్సిజన్ సదుపాయం ఉన్న 100 పడకలతో. రాజస్థాన్లో... భారత్-పాకిస్థాన్ సరిహద్దు దగ్గర బార్మెర్ జిల్లాలో... జస్ట్ 40 మంది సైనికులు ఈ ఆస్పత్రిని ఇంత తక్కువ టైమ్లో నిర్మించారంటే నమ్మలేం. దేశం కష్టాల్లో ఉన్న ప్రతిసారీ... ఇండియన్ ఆర్మీ... దేశ రక్షణ బాధ్యతలతోపాటూ... సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా ముందుకొస్తుంది. కరోనా సెకండ్ వేవ్తో దేశం అల్లాడుతున్న టైమ్లో మరోసారి నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఆఘమేఘాలపై ఆస్పత్రిని నిర్మించడమే కాదు... దాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి అప్పగించేసింది కూడా. ఇందుకు విదేశీ టెక్నాలజీ ఏదీ వాడలేదు. అంతా ఆత్మనిర్భర భారతమే.
మనందరికీ తెలుసు... కరోనా తీవ్రమైన కొద్దీ పేషెంట్లకు ఊపిరి సరిగా ఆడదు. అప్పుడు వారికి సరిపడా గాలి ముక్కు ద్వారా లోపలోకి వెళ్లదు. ఆ కొద్ది గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వారు పీల్చే కొద్ది గాలిలో పూర్తిగా ఆక్సిజన్ ఉండాలి. అందుకే ఆక్సిజన్ సిలిండర్లు అవసరం. అలాంటి సిలిండర్లతో కూడిన బెడ్లు అవసరం. అందుకే ఆర్మీ... జిల్లా ఆస్పత్రికి దగ్గర్లోనే ఉన్న కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్లో ఆక్సిజన్ పడకలతో ఆస్పత్రిని నిర్మించింది. నిజానికి ఈ 100 పడకల్ని ఆర్మీ... ముందుగా జైసల్మీర్ రోడ్డులోని ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసింది. అయితే అది జిల్లా ఆస్పత్రికి చాలా దూరంలో ఉండటంతో... వెంటనే ఇక్కడకు షిఫ్ట్ చేసింది. ఇందుకోసం 40 మంది సైనికులు 100 పడకల్ని వెంటనే తరలించారు. అలాగే 100 ఆక్సిజన్ సిలిండర్లను తరలించారు. అంతా 3 గంటల్లోనే పూర్తి చేశారు.
బార్మెర్లో కరోనా కేసులు బాగా పెరుగుతుంటే... ఏం చెయ్యాలో అర్థం కాక... అక్కడి యంత్రాంగం ఆర్మీని సాయం కోరింది. అర్జెంటుగా తమకో ఆస్పత్రి కావాలి అని చెప్పింది. అంతే... రాత్రి 9 గంటల సమయంలో 40 మంది సైనికులు రంగంలోకి దిగారు. రాత్రి 12 అయ్యేసరికి ఆస్పత్రి రెడీ అయిపోయింది. అందులో సకల సదుపాయాలూ వచ్చేశాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.
బార్మెర్ జిల్లాలో ప్రజలకు సేవ చెయ్యడానికి ఆర్మీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. జిల్లా యంత్రంగా 100 బెడ్లు కావాలని చెప్పింది. అవి ఆల్రెడీ ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నాయి. అంత దూరం పేషెంట్లను తీసుకెళ్లే పరిస్థితి లేదు. డాక్టర్లు కూడా జిల్లా ఆస్పత్రి నుంచి అక్కడికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఆర్మీ చేసిన పనికి జిల్లా యంత్రాంగం ఎంతో ఆనందిస్తోంది అని ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ బ్రిగేడియర్ సలిల్ సేత్ తెలిపారు.
కరోనా సోకిన వారందరికీ ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేదు. చాలా మందికి వ్యాధి ముదరకుండా ముందుగానే అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. కానీ ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే మాత్రం వెంటనే అందించాల్సి ఉంటుంది. క్షణక్షణం అయ్యేకొద్దీ వారికి సమస్య తీవ్రం అవుతుంది. అందుకే ఆక్సిజన్ బెడ్లు అత్యవసరం. బార్మెర్ జిల్లాలో సోమవారం 202 మందికి కరోనా సోకింది. ఫలితంగా కరోనా సోకిన మొత్తం పేషెంట్ల సంఖ్య 7785కి పెరిగింది. సోమవారం ఓ పేషెంట్ చనిపోగా... మొత్తం చనిపోయిన వారి సంఖ్య 95కి చేరింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.