అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris)తో సమావేశమయ్యారు. వైట్హౌస్ ఆవరణలోని ఐసెన్హవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్లో ఆమెతో భేటీ అయ్యారు నరేంద్ర మోదీ. ఇరువురు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి సమయంలో సహకరించిన అమెరికాకు ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షురాలిగా కమలాహారిస్ గెలవడం చారిత్రాత్మకమని.. ప్రపంచానికి కమలా హారిస్ ఒక స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. జో బైడెన్ (Joe Biden), కమలా హారిస్ (Kamala Harris) నేతృత్వంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కమలా హారిస్ను భారత్ పర్యటనకు ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోదీ.
అటు కమలా హారిస్ సైతం భారత్పై ప్రశంసలు కురిపించారు. కరోనా ప్రారంభ సమయంలో ఎన్నో దేశాలకు భారతే ప్రధాన వ్యాక్సిన్ వనరుగా ఉండేదని కొనియాడారు. ''అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి. కరోనా వ్యాప్తి పతాక స్థాయిలో ఉన్నప్పుడు భారత్ ప్రపంచానికి ఎంతో సాయం చేసింది. కరోనాపై పోరాటం కోసం మన కలిసి కట్టుగా పనిచేశాం. మహమ్మారి విజృంభించిన ప్రారంభంలో ఇండియానే అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ను సరఫరా చేసేది. ఇండియాలో రెండో దశ కరోనా వ్యాప్తి చెందినప్పుడు అమెరికా తన బాధ్యతగా సహకారం అందించింది. వ్యాక్సినేషన్ విషయంలోనూ సాయం చేసింది. భారత్లో ప్రస్తుతం రోజుకు కోటీ టీకాలు వేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే వ్యాక్సిన్ ఎగుమతులను తిరిగి ప్రారంభిస్తామని మోదీ చెప్పారు. దీనిని నేను స్వాగతిస్తున్నా. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.' అని కమలా హారిస్ పేర్కొన్నారు.
Washington DC: Prime Minister Narendra Modi and US Vice-President Kamala Harris at the Eisenhower Executive Office Building, near the premises of the White House pic.twitter.com/bNN0Btl8r5
— ANI (@ANI) September 23, 2021
PM Modi USA Tour: అమెరికాలో ప్రధాని మోదీ బిజిబిజీ.. క్వాల్కామ్ సీఈవోతో భేటీ
కాగా, నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు అమెరికా దిగ్గజ కంపెనీలు క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్స్టోన్ సీఈవోలతో చర్చలు జరిపారు ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్తో భేటీ అయ్యి.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇక ఇవాళ (సెప్టెంబరు 24) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో వైట్హౌస్లో చర్చలు జరుపుతారు. అప్ఘానిస్తాన్ పరిణామాలు, ఉగ్రవాదం, చైనా ఆధిపత్యం, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు. అనంతరం అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ న్యూయార్క్ బయల్దేరి వెళతారు. సెప్టెంబరు 25న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే రోజు భారత్కు తిరుగు ప్రయాణమవుతారు. సెప్టెంబర్ 26న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Kamala Harris, Narendra modi, Us news