కొత్త ఐటీ నిబంధనల విషయంలో కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ (Twitter)మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త నిబంధనలను ఇన్నాళ్లు ఏ మాత్రం పట్టించుకోని ట్విట్టర్.. కేంద్రం ఫైనల్ వార్నింగ్తో ఎట్టకేలకు దిగొచ్చింది. భారత చట్టాలకు కట్టబడి ఉంటామని తెలిపింది. ఐతే నిబంధనల అమలుకు మరికొంత సమయం కావాలని కోరింది. కొత్త నిబంధనల మేరకకు భారత్లో గ్రీవెన్స్, నోడల్ అధికారులను ఒప్పంద ప్రాతిపదికన నియమించినట్లు ట్విటర్ ఇండియా పేర్కొంది. అంతేకాదు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ను నియమించే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది ట్విటర్. ఫిబ్రవరి 25న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఫిబ్రవరి 25న నోటిఫై చేసినట్లు గుర్తు చేసింది. ఐతే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వెంటనే నిబంధనల అమలు ఆలస్యమవుతోందని పేర్కొంది.
కొత్త ఐటీ రూల్స్పై ట్విటర్ స్పందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. భారత్లో అధికారులను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ జూన్ 5న నోటీసులు జారీచేసింది. వెంటనే భారత్లో అధికారులను నియమించాలని స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్విటర్ దిగొచ్చింది. కేంద్రం నోటీసులకు సానుకూలంగా స్పందించింది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది.
కగా, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో The Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021ని నోటిఫై చేసింది. వార్తా వెబ్సైట్లు, ఓటీటీలు, సోషల్ మీడియాకు సంబంధించిన ఆ కొత్త రూల్స్ మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు భారత్లో అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి. అంతేకాదు ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్ గురించి ప్రభుత్వం అడిగితే, ఆ మెసేజ్ను మొదట ఎవరు సృష్టించారు? అనే వివరాలను వెల్లడించాలి. అన్ని సామాజిక మాధ్యమాటు, డిజిటల్ వెబ్సైట్లు కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఐతే గడువు ముగిసినప్పటికీ.. ట్విటర్ సహా పలు సామాజిక మాధ్యమాలు మాత్రం కొత్త నిబంధనలను పాటించడం లేదు. నిబంధనల ప్రకారం భారత్లో చీఫ్ కంప్లియన్స్ ఆఫీసర్లను నియమించాల్సి ఉంది. కానీ ట్విటర్ ఇప్పటికీ ఆ పనిచేయలేదు. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారత్కు చెందిన వ్యక్తులను కూడా నియమించలేదు. ఈ క్రమంలోనే ట్విటర్ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు గత వారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ నేతల ట్విటర్ ఖాతాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్)ను తొలగించింది. ట్విటర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మనదేశంలో ట్విటర్ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో వెంటే దిగొచ్చిన ట్విటర్.. మళ్లీ బ్లూటిక్ను పునురుద్ధరించింది. ఇక కొత్త నిబంధనలను అమలు చేస్తామని తాజాగా కేంద్రానికి లేఖరాసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digital media, IT Rules, Social Media, Twitter