భారత్-చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు చేపడుతూ కవ్వింపులకు పాల్పడుతోంది చైనా. ఇక ఇదే సమయంలో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం మరింత ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తుండడంతో భారత్–చైనా సైనికుల మధ్య మరిన్ని ఘర్షణలు జరగవచ్చని తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన నివేదికలోని పలు అంశాలతో రాయిటర్స్ ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది.
పరిస్థిని ఊహించలేమంటోన్న లెఫ్టినెంట్ జనరల్:
అటు చైనా-భారత్ సరిహద్దుల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తోన్న ఆర్మీ .. చాలా అప్రమత్తంగా ఉంది. అయితే సరిహద్దు పరిస్థితులపై లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలిటా భిన్న వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని..కానీ ముందు ముందు ఏం జరుగుతుందో ఊహించలేమంటూ కలిటా వ్యాఖ్యానించారు. సరిహద్దు భద్రతను కాపాడటంలో తూర్పు వైపున ఉన్న సైన్యం పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ఇక ఆర్మీ కూడా ఎంతో అలెర్ట్గా అందని స్పష్టం చేశారు.
ఎల్ఏసీ వద్ద హైవే:
చైనా అక్రమ ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలకు చెక్ పెట్టేలా కేంద్రం కౌంటర్ ప్లాన్ మొదలుపెట్టింది. ఎల్ఏసీ వెంబడి 135 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మాణానికి రక్షణ శాఖ తన అడుగులను వేగవంతం చేసింది. హైవే నిర్మాణం కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ హైవేను రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. లడఖ్లో ఎల్ఏసీకు దగ్గరగా ఉన్న చుషుల్ నుంచి డేమ్ చుక్ వరకూ ఈ హైవేను నిర్మించనున్నారు. మధ్యలో డూంగ్రీ, ఫక్చే ప్రాంతాలను ఇది కనెక్ట్ చేయనుంది. ఇక రోడ్డు నిర్మాణానికి అప్పటి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 2016 మార్చిలో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు యూనియన్ టెరిటరీలోని చాంగ్ తంగ్ కోల్డ్ ఎడారి వన్య ప్రాణాల అభయారణ్యం గుండా వెళుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.