రెండేళ్ల కిందటి విపత్కర పరిస్థితులను తిరగరాస్తూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్, పాత డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ దిశగా వెళుతున్నాయి. భారత్ లోనూ చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట్ కర్ఫ్యూ అమలవుతుండగా, ఉదయం పూట కూడా వ్యాపార సముదాయాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ ఒక్కటే దారి కావడంతో భారత్ సామూహిక టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఆ క్రమంలోనే ఇండియా మరో రెండు కొత్త కొవిడ్ వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఒక ట్యాబ్లెట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఒక్కరోజే రెండు వ్యాక్సిన్లు, ఒక ట్యాబ్లెట్ కు అనుమతివ్వడం ద్వారానూ ఇండియా రికార్డు సాధించింది..
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోన్న వేళ.. వైరస్పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ... మంగళవారం భారత్ మరో రెండు కోవిడ్ టీకాలను ఆమోదించింది. వ్యాక్సిన్లు- కొవావాక్స్, కార్బోవాక్స్, యాంటీ వైరల్ డ్రగ్ 'మోల్నూపిరావిర్'లను అత్యవసర వినియోగానికి అనుమతించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ తాజా ఆమోదంతో దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్'కు, బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బివాక్స్కు అనుమతులు మంజూరు చేయాలని, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్సిఒ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు కేంద్రం వాటి వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వీటి వినియోగానికి ఆమోదం లభించిందని మంత్రి మాండవీయ చెప్పారు.
అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. బ్రిటన్, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను జతచేసింది. ఈ క్రమంలోనే సిడిఎస్సిఒ నిపుణుల బఅందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సోమవారం సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్కు అనుమతినిచ్చింది.
రెండు వ్యాక్సిన్లు, ఒక ట్యాబ్లెట్ కు అనుమతిచ్చే ప్రకటన చేస్తూ మంత్రి మాండవీయ కీలక విషయాలు కొన్ని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 వ్యాధికి 'మోల్నుపిరవిర్' ఔషధం అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపామని, మెర్క్, రిడ్జ్బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంయుక్తంగా ఈ యాంటీ-వైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేశాయని, భారత్లో ఈ ఔషధాన్ని 13 సంస్థలు తయారు చేస్తాయని వెల్లడించారు. కోవిడ్తో బాధపడుతున్న వృద్ధులు, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వినియోగిస్తారని మంత్రి మాండవీయ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Covid vaccine, India, Omicron