ప్రపంచ వ్యాప్తంగా 2020, 2021 సంవత్సరాలలో కొవిడ్ సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకి లక్షలాది మందిక అసువులు బాశారు. దీన్ని కట్టడి చేసేందుకు టీకా తయారీకి ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రయోగాలు జరిగాయి. మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ నేతృత్వంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేసింది. ఇపుడు అదే సంస్థ ఇన్కొవ్యాక్ (iNCOVACC) పేరుతో మరో కోవిడ్ టీకాను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే ముక్కు ద్వారా డ్రాప్స్ రూపంలో ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చు.
కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర శాస్ర్త సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్ సమక్షంలో ఢిల్లీలో గురువారం ఈ టీకాను విడుదల చేశారు. చుక్కల రూపంలో ముక్కు ద్వారా తీసుకునే ఇలాంటి వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అని, ఆత్మనిర్భర్ భారత్ విజయానికి ఇదొక మంచి ఉదాహరణ అని మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. ఇక ఇంజిక్షన్లు, సూదులు వంటి వాటితో పని ఉండదని, 18 ఏళ్లు నిండిన వారు సులభంగా దీన్ని వినియోగించవచ్చని పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో భారీ సంఖ్యలో వీటిని ఉత్పత్తి చేయనున్నారు.
* ప్రపంచంలోనే మొదటిది
ముక్కు ద్వారా వేసుకునే ప్రత్యేకతతో పాటు రెండు ప్రైమరీ డోసులుగా, బూస్టర్ డోస్గా వేసుకోడానికి అనుమతి పొందిన మొదటి వ్యాక్సిన్ కూడా ఇదే. శాస్ర్త, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన పి.ఎస్.యు, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్ (బి.ఐ.ఆర్.ఏ.సి) సహకారంతో భారత్ బయోటెక్ దీన్ని తయారు చేసింది.
టీకా ప్రారంభం సందర్భంగా మంత్రి మాండవీయ మాట్లాడుతూ ప్రపంచం మార్కెట్లోకి వచ్చిన టీకాల్లో 65 శాతం ఇండియా నుంచి వచ్చినవే అని అన్నారు. ఈ సందర్భంగా బీ.బీ.ఐ.ఎల్ బృందానికి, బయోటెక్నాలజీ విభాగానికి అభినందనలు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులు ఉత్పత్తి చేయడంలో భారత్ ముందు ఉందన్నారు.
వైద్య రంగంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని, వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందంజలో ఉందని మరో మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇటువంటి ఆవిష్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ మరింత బలోపేతం అవుతుందని భారత్ బయోటెక్ సంస్థను అభినందించారు. మిషన్ కొవిడ్ సురక్ష ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ రంగంలో భారత్ స్థానం మరింత పెరిగిందన్నారు. మిషన్ కొవిడ్ సురక్షలో భాగంగా DNA ఆధారిత ZyCoV-D వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత మనదే అన్నారు. నాన్ కమ్యూనబుల్ వ్యాధులకు టీకా అందించడమే తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : వందేభారత్ తాత్కాలికమేనా.. కేంద్రం ప్లాన్ వేరే ఉందా?
* ధర ఎంతంటే..
కొవిడ్ పోర్టల్లో ఈ టీకాకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో తొలుత లభ్యం కానుంది. ప్రైవేటు మార్కెట్లో దీని ధర రూ.800 కాగా, ప్రభుత్వ పరిధిలో రూ.300కే దొరుకుతున్నట్లు పీ.టీ.ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.