సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. నిజానికి జనవరి 24వ తేదీనే హైపవర్ కమిటీ ఈ నియామకాన్ని చేపట్టాల్సి ఉన్నా.. హైపవర్ కమిటీ సభ్యుడైన కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అభ్యంతరంతో నియామకం వాయిదా పడింది. తాజా సమావేశంలోనూ ఖర్గే అభ్యంతరాలను వెలిబుచ్చడంతో.. వాటిని తోసిరాజని డైరెక్టర్ నియామకాన్ని చేపట్టాలని కమిటీ తాజాగా నిర్ణయించింది.
శుక్రవారం జరిగిన సమావేశంలో కొంతమంది అధికారుల పేర్లను హైపవర్ కమిటీ పరిశీలించింది. అయితే ఆ జాబితాపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. జాబితాలో 1984 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారులు జావీద్ అహ్మద్, రజనీ కాంత్ మిశ్రా, ఎస్ఎస్ దేశ్వాల్ ముందు వరుసలో ఉన్నారు.
సీబీఐకి పూర్తి స్థాయి డైరెక్టర్ను త్వరగా నియమించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. నియమాకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. కాగా, అనూహ్య పరిణామాల నడుమ డైరెక్టర్ పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగి.. మళ్లీ పదవి చేపట్టిన రెండు రోజులకే అలోక్ వర్మను హైపవర్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 10 నుంచి ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. వర్మ స్థానంలో నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడాయన స్థానంలో పూర్తి స్థాయి డైరెక్టర్ను కేంద్రం నియమించనుంది.
ఇది కూడా చదవండి : నేడే సీబీఐ డైరెక్టర్ నియామకం.. రేసులో ముందున్న ఆ ఐదుగురు!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, CJI Ranjan Gogoi, Mallikarjun Kharge, Narendra modi