సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం ప్రకటించినప్పటికీ అభిమానులు మాత్రం ఆశలు వీడటం లేదు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని తలైవా చెప్పినా.. ఆయన తప్పకుండా పార్టీ స్థాపిస్తారని వారిలో కొంతమంది విశ్వసిస్తున్నారు. అంతేగాక రజినీ రాజకీయాల్లోకి రావాలని ఇటీవలే చెన్నైలో ఆయన అభిమాన సంఘాలుగా చలామణి అవుతున్న పలువురు నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తలైవా మరోసారి అభిమానులకు స్పష్టమైన నిర్ణయం ప్రకటించారు. తన నిర్ణయమే ఫైనల్ అని కూడా చెప్పేశారు. తాను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని చెప్పకనే చెప్పాడు తలైవా..
రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ప్రవేశించకూడదనే నా నిర్ణయానికి వ్యతిరేకంగా నా అభిమానులు కొంతమంది రజిని మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం) కు సంబంధం లేని కార్యకర్తలతో నిరసనలు చేస్తున్నారు. నేను నా నిర్ణయం తీసుకున్నాను. అదే ఫైనల్. ఇకనుంచి నా అభిమానులెవరూ రాజకీయ పార్టీ గురించి నాపై ఒత్తిడి తేవొద్దు. అంతేగాక ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకూడద’ని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని తలైవా అన్నారు.
అంతేగాక.. తాను ఎన్నికలలో ఎందుకు పోటీ చేయడం లేదనే దానిపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. చెన్నైలో రజినీ అభిమానులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చాలా మంది ఆర్ఎంఎం కార్యకర్తలు కాదని రజినీ అభిమాన సంఘాల అధ్యక్షుడు ఒకరు తెలిపారు. ఇది బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ఆర్ఎంఎం బహిష్కరించిన వారితో కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారని వివరించారు. వీరి నిరసన ఆర్ఎంఎం నిర్ణయానికి వ్యతిరేకమని స్వయంగా రజినీయే వ్యాఖ్యానించడం గమనార్హం. తన రాజకీయ ప్రయోజనం ద్వారా లబ్ది పొందాలనే వారే ఈ కుట్రలు పన్నుతున్నారని రజినీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. తాజా ప్రకటనతో ఇక రాజకీయాల నుంచి రజినీ పూర్తిగా స్వస్తి చెప్పినట్టేనని తమిళనాట రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Rajinikanth, Tamil nadu Politics, Tamilnadu