లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచీ యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ పోటీ చెయ్యాలనుకోవడం ఆశ్చర్యకరమే. 2016లో 70 ఏళ్ల వయసు రాగానే... రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నారు సోనియా గాంధీ. కానీ పార్టీ నుంచీ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యే వరకూ ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలన్న డిమాండ్లు వినిపించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో... రాహుల్ అధ్యక్ష పీఠం అధిరోహించారు. అప్పటి నుంచీ ఏడాది కాలంగా... కాంగ్రెస్ నేతలతో సోనియా సమావేశాలేవీ లేవు. ఎవరు ఏం చెప్పినా... రాహుల్కి చెప్పండని అంటున్నారు. ఐతే... పుల్వామా ఉగ్ర దాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఢిల్లీలో పరిస్థితులు మారాయి. సోనియా గాంధీ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాక తప్పట్లేదు.
ఇప్పుడున్న రాజకీయాల్లో యూపీఏ వైపు నుంచీ అత్యంత శక్తిమంతమైన నేత సోనియా గాంధీయే. లోక్సభ ఎన్నికల తర్వాత యూపీఏ పక్షాలకు ఎక్కువ సీట్లు వస్తే... ఎవరికి అధికారాన్ని అప్పగించాలి, ఎవర్ని ప్రధాని పీఠం ఎక్కించాలన్నది నిర్ణయించే శక్తి సోనియా గాంధీయే.
విదేశీ కోడలు అనే ట్యాగ్ లైన్తో దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన సోనియా... ఇక్కడి రాజకీయాల్ని త్వరగానే వంటబట్టించుకున్నారు. తన సాఫ్ట్ కార్నర్తో ఉద్దండులైన బీజేపీ నేతల్ని వెనక్కి నెట్టారు. 2004లో ఆమె DMKతో పొత్తు పెట్టుకోవడం సంచలన నిర్ణయం. డీఎంకే... LTTEకి అనుకూలంగా మాట్లాడుతోందని 1997లో కాంగ్రెస్ నేతలే ఆరోపించారు. గతాన్ని పక్కన పెట్టిన సోనియా... కొత్త రాజకీయాలకు తెరతీసి యూపీఏ సంకీర్ణ శకాన్ని అన్నీ తానై నడిపించగలిగారు. విమర్శకుల నోళ్లు మూయించారు. మొండి పట్టుదలకు పోయే NCP, తమ మాటే నెగ్గాలనే సమాజ్ వాదీ పార్టీ... తనకు తిరుగే లేదనే బీఎస్పీ ఇలా అన్ని పార్టీలను ఏకతాటిపై నడిపిస్తూ... 2004-2014 మధ్య దేశ రాజకీయాల్ని ముందుకు నడిపించారు.
అవినీతి ఆరోపణలతో యూపీఏ రెండో ప్రభుత్వం భారీ ఓటమిని చూసినా... అధికార బీజేపీ... కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని అందుకున్నా... అనేక రాష్ట్రాల్లో పార్టీ పునాదులు కదిలిపోయినా... సోనియా పట్టుదల కోల్పోలేదు. తన కొడుకును కాంగ్రెస్ వారసుడిగా నిలబెట్టి... బీజేపీ కంచుకోటలైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను అధికారంలోకి రప్పించారు. నిజానికి ఆ ఎన్నికల్లో ప్రాంతీయ ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఎక్కువ ప్రభావం చూపినా... అవి కాంగ్రెస్కీ, రాహుల్కీ కొండంత బూస్ట్ ఇచ్చాయి. తాజాగా సోదరి ప్రియాంక కూడా రాజకీయాల్లోకి దిగడంతో... కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి.
సోనియా జీవితం చాలా వరకూ పరిస్థితులను బట్టీ మారిందే తప్ప... ఆమె ఇష్టానుసారం సాగలేదు. సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని సోనియా వ్యతిరేకించారు. కానీ తల్లి ఇందిరా గాంధీ నుంచీ రాజీవ్ గాంధీ రాజకీయ వారసత్వాన్ని అందుకోక తప్పలేదు. రాజీవ్ మరణానంతరం సోనియా రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. కానీ ప్రణబ్ ముఖర్జీ సహా సీనియర్లంతా ఆమె రావాల్సిందే అన్నారు. రాజీవ్ గాంధీపై ప్రేమ, భారత్లోనే జీవించాలనే ఆలోచన కలగలిసి... సోనియా రాజకీయ చట్రంలోకి ఎంటరయ్యారు. ఇక అప్పటి నుంచీ ఇప్పటివరకూ దాన్నుంచీ బయటపడలేకపోతున్నారు.
ప్రస్తుతం సోనియా క్రియాశీలకంగా ఉంటేనే కాంగ్రెస్కి కలిసొస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీకి తగ్గిన రేటింగ్, పడిపోయిన గ్రాఫ్ మళ్లీ పెరగకుండా ఉండాలంటే... కాంగ్రెస్లో మేడం ఉండాలన్న డిమాండ్... ఆయా రాష్ట్రాల నుంచీ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆమె ఉంటేనే కేడర్లో ఉత్సాహం కనిపిస్తుందనే వాదన వినిపిస్తోంది. పైగా రాహుల్పై ఎక్కువ భారం పడకూడదన్న ఉద్దేశంతో సోనియా మళ్లీ రాయ్ బరేలీ నుంచీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.