కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్నదాతలు డిసెంబర్ 8న భారత్ బంద్కు పిలుపునిచ్చిన వేళ హర్యానాకు చెందిన కొన్ని రైతు సంఘాలు మోదీకి మద్దతు పలికాయి. హర్యానాకు చెందిన 70వేల ఎఫ్పీఓతో కూడిన 50వేల మందికి పైగా రైతులు కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు మద్దతు పలుకుతున్నామని ప్రకటించాయి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖను రాశాయి. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను అలాగే ఉంచాలని ఆ లేఖలో కోరాయి. కేంద్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ గత 10 రోజులుగా పంజాబ్, హర్యానా, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు వేలాదిగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, దీని వల్ల రైతులకు మేలు ఎక్కువగా జరుగుతోందని కేంద్రం వాదిస్తోంది. ఈ క్రమంలో రైతు సంఘాలు, కేంద్రం ప్రతినిధుల మధ్య జరిగిన దఫదఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలప్రదం కాలేదు. ఈక్రమంలో డిసెంబర్ 8న భారత్ బంద్కు రైతులు మద్దతు పలికారు.
రైతుల భారత్ బంద్కు చాలా రాష్ట్రాలు మద్దతు పలికాయి. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకపక్షాలు ఉన్న రాష్ట్రాలు మద్దతు పలుకుతున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బంద్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా బంద్కు మద్దతు ప్రకటించింది. బంద్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. అందుకు తగినట్టే ఆర్టీసీ బస్సులు కూడా 1 గంట వరకు రోడ్డెక్కవు. ఆఫీసులు కూడా తెరవరు. స్కూళ్లు మూసి ఉంచుతారు.
కేంద్రం తెచ్చిన రైతు చట్టాల విషయంలో పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య వివాదం కొనసాగుతోంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హర్యానాలో బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైతులను కావాలనే ఎగదోస్తున్నారంటూ పంజాబ్పై హర్యానా మండిపడుతోంది. రైతులకు నష్టం చేసే చట్టాలకు తాము మద్దతు ఇవ్వబోమని, కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు నష్టం చేస్తాయంటూ పంజాబ్ వాదిస్తోంది. ఓ దశలో బీజేపీ కీలక నేత, హోంమంత్రి అమిత్ షా కూడా రైతులను శాంతింపజేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో చర్చలు జరిపారు. అయితే, తానేమీ చేయలేనని, రైతులతోనే మాట్లాడుకోవాలంటూ ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం చట్టాల విషయంలో రైతులు బాగా పట్టుదలతో ఉన్నారు. కేంద్రంతో చర్చలకు వెళ్లినప్పుడు వారు ఇచ్చే టీ కాఫీలు, భోజనాలు కూడా తీసుకోవడం లేదు. తమ భోజనాలు, టీ కూడా తామే తెచ్చుకుంటున్నారు. ఓ దశలో తమ నిరసన తెలిపేందుకు నేల మీద కూర్చుని రైతు సంఘాల నేతలు భోజనం చేశారు. ఇప్పటికే రైతులతో కేంద్రం చర్చలు ఐదు దఫాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 9న మరోసారి భేటీ కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Bandh, Haryana, Punjab