అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram mandir) నిర్మాణ పనులు వడి వడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు ప్రారంభించి ఏడాది దాటి పోయింది. ఈ క్రమంలో అయోధ్య రామాలయానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని కేంద్రరక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చెప్పారు. రామమందిరం నిర్మాణానికి ఏడు ఖండాల్లోని 115 దేశాల నుంచి పవిత్ర జలాలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 115 దేశాల నుంచి పవిత్ర జలాలు ఢిల్లీకి చేరుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఈ పవిత్ర జలాన్ని రామజన్మభూమి ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ ఆధ్వర్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిలీలోని తన నివాసంలో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్, ఫిజీ, నైజీరియా సహా పలు దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు. బీజేపీ నేత, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జాలీ నేతృత్వంలోని ఎన్జీఓ సంస్థ ద్వారా ఈ నీటిని సేకరించారు. ఈ జలాన్ని రామమందిరం నిర్మాణంతో పాటు రాముని అభిషేకానికి వినియోగించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
'' అయోధ్య రామ మందిరం కోసం 115 దేశాల్లోని హిందువులు, ముస్లింలు, బుద్ధులు, సిక్కులు, యూదులు అక్కడి పవిత్ర నదులతో పాటు సముద్ర జలాన్ని పంపించారు. మరో 77 దేశాలనుంచి జలం రావాల్సి ఉంది. మొత్తం 7 ఖండాల్లోని 192 దేశాల్లో గల పవిత్ర జలాన్ని సేకరిస్తున్నాం. 115 దేశాల నుంచి నీటిని సేకరించాం. రామమందిర నిర్మాణం పూర్తయ్యే లోపు మిగితా 77 దేశాల్లోని జలం కూడా రానుంది. అన్ని దేశాల నుంచి జల సేకరణ వినూత్న ఆలోచన. ఇది వసుధైవ కుటుంబాన్ని ప్రతిబింబిస్తుంది. భారతీయ సంస్కృతి చాలా గొప్పది.'' అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Army Song: జవాన్ల కోసం సరికొత్త పాట.. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసేలా
కాగా, తొలిదశ నిర్మాణం పూర్తయినట్టు అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఇటీవలే వెల్లడించారు. రామమందిర పునాది నిర్మాణానికి 40 అడుగుల మేర భూమిని తవ్వారు. 48 లేయర్స్తో పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికి తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇక రెండో దశ ఆలయనిర్మాణం రానున్న రెండు నెలల్లో పూర్తవుతుందని చంపత్రాయ్ తెలిపారు. మూడో దశ నిర్మాణానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముందని చెప్పారు.
GreenHeros: ఈ అన్నదమ్ములు భేష్.. 48 గంటల్లో ఎన్నివేల మొక్కలు నాటారంటే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గత ఏడాది ఆగస్ట్ 5వ తేదీన భూమి పూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో, మూడంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇటుకలు , స్టీల్ను వినియోగించకుండా రాజస్థాన్కు చెందిన పాలరాతితో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. 2023 డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. 2024 నాటికి భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Up news, Uttar pradesh