కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిల్లుపై ఓవైపు ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటుంటే.. మరోవైపు ఈ బిల్లు ద్వారా తమ చిరకాల కల నెరవేరుతుందని శరణార్థులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి శరణార్థుల్లో ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో నివసిస్తున్న హిందూ శరణార్థి కుటుంబం ఒకటి. ఏడేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వలసొచ్చిన ఈ కుటుంబం ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలోని పునరావాస కాలనీలో నివాసం ఉంటోంది.దేశ పౌరసత్వం కోసం ఏళ్లుగా తాము ఎదురుచూస్తున్నామని..ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,తమ పాపకు 'నాగ్రిక్త(సిటిజెన్షిప్)' అని నామకరణం చేయడం విశేషం.
నిజానికి పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ముందే పాప పుట్టినప్పటికీ.. బిల్లు పాస్ అయిందన్న సంతోషంతో పాపకు ఆ పేరు పెట్టినట్టు తెలిపారు. 2012లో ఇండియాకి వచ్చినప్పటి నుంచి తాము పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నామనీ..తమకు పాప పుట్టిన తర్వాత పౌరసత్వం వస్తుందన్న నమ్మకం పెరిగిందని చెప్పారు. అనుకున్నట్టుగానే బుధవారం రాజ్యసభలో బిల్లు పాస్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ కావాలని భగవంతుడికి ప్రార్థనలు కూడా చేసినట్టు తెలిపారు.ఇప్పటికైనా శరణార్థులకు పౌరసత్వం కల్పించే బిల్లును తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆ కుటుంబం వెల్లడించింది.
కాగా,మజ్ను కా తిలా ప్రాంతంలోని పునరావాస కాలనీల్లో దాదాపు 750 హిందూ శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరంతా పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వలస వచ్చినవారే. అలాగే రోహిణి సెక్టార్ 9,11,ఆదర్శనగర్,సిగ్నేచర్ బ్రిడ్జి ప్రాంతంలోనూ చాలానే శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి.ఇదిలా ఉంటే, బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 125 మంది మద్దతివ్వగా, 99మంది వ్యతిరేకంగా ఓటేశారు. లోక్సభలో మద్దతిచ్చి సహకరించిన శివసేన రాజ్యసభలో మాత్రం ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసింది. తాజా బిల్లు ద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలసొచ్చిన హిందూ, క్రైస్తవ, బౌద్ద, సిక్కు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఈ చట్టం తమ అస్తిత్వానికి ముప్పు తెస్తుందని ఈశాన్య రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అలాగే పౌరసత్వ కల్పనలో ముస్లింలను మినహాయించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
Published by:Srinivas Mittapalli
First published:December 12, 2019, 09:00 IST