Himalayan Yak: దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో దాదాపు అందరినీ ఆకట్టుకునేవి హిమాలయ పర్వత ప్రాంతాలు. మంచు కప్పుకొని కనిపించే ఆ ప్రదేశాలలో కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన జంతువులు, పక్షులు నివసిస్తుంటాయి. చలిని తట్టుకొనే జాతులే అక్కడ కనిపిస్తాయి. అలాంటివే జడల బర్రెలు(Himalayan Yak). వీటిని స్థానికులు పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. వాటి పాలను తాగడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ హిమాలయన్ యాక్కు ఫాసీ ఫుడ్ యానిమల్ ట్యాగ్ కేటాయిస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారికంగా భారత్లో తినదగిన జంతువుల కిందకు ఈ హిమాలయన్ యాక్ చేరుతోంది. హిమాలయన్ యాక్ను ఆహార జంతువుగా ప్రకటించాలని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ చేసిన సిఫార్సుకు.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) సైంటిఫిక్ ప్యానల్ ఆమోదం తెలిపింది.
ఆర్థిక లాభం ఉంటుంది
అన్ని రకాల అధికారిక అనుమతులు లభిస్తే జడల బర్రెల పాలు, మాంసం దేశ వ్యాప్తంగా ఉన్న దుకాణాలలో విక్రయించే అవకాశం లభించనుంది. దీనిపై ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో నివసించే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన మార్పులతో తమకు ఆర్థికంగా మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ పైఅధికారులు అప్రూవ్ చేసి అధికారికంగా ఓ గెజిట్ విడుదల చేయాల్సి ఉంది. అది వస్తే వీటి పాలు, మాంసం అమ్మకాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ఈ విషయంపై డైరెక్టర్ ఆఫ్ ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మిహిర్ సర్కార్ మాట్లాడారు. ఎవరూ ఈ హిమాలయ బర్రెలను పెంచడానికి ఆసక్తి చూపించడం లేదన్నారు. ఎందుకంటే వీటి నుంచి వారికి ఆర్థికంగా పెద్దగా లాభాలు లేవని చెప్పారు. దీంతో అక్కడ వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని తెలిపారు. కేవలం స్థానికంగా మాత్రమే వీటి పాలు, మాంసం తింటారని చెప్పారు. దీంతో వీటికి పెద్ద మార్కెట్ ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల వల్ల వీటికి డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. దీంతో స్థానిక రైతులు వీటిని పెంచేందుకు ఆసక్తి చూపుతారని, వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Mulugu: మేలు రకం దేశీ కోళ్ల పెంపకం.. ప్రభుత్వ సబ్సిడీ పొందడం ఎలా?
అరుణాచల ప్రదేశ్లో ఎక్కువ
భారతదేశంలో దాదాపు 58 వేల యాక్స్(Yaks) ఉన్నాయి. ఇవి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం , హిమాచల్ ప్రదేశ్, లడఖ్ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అరుణాచల్లో వీటి జనాభా 24 వేలు ఉంటుందని అంచనా. అక్కడి తవాంగ్, వెస్ట్ కమెంగ్, షి యోమి జిల్లాలలో ఇవి కనిపిస్తుంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా వీటి సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. వచ్చే ప్రతిఫలం తక్కువ కాబట్టి వీటి పెంపకానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
పాలు, మాంసంలో అధిక పోషకాలు
ఈ బర్రెల మాంసం బీఫ్తో పోలిస్తే మెరుగైనదని చెబుతారు. వీటి పాలలో చాలా పోషకాలు నిండి ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలలో ఔషధ విలువలూ ఉన్నాయని చెబుతారు. వీటిలో 78- 82 శాతం నీరు, 7.5-8.5 శాతం కొవ్వు, 4.9- 5.3 శాతం ప్రోటీన్, 4.5-5.0 శాతం లాక్టోస్, 12.3- 13.4 శాతం ఫ్యాట్ సాలిడ్స్ ఉంటాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండే ప్రజలు తమ సంప్రదాయ వంటల్లో ఈ పాలను ప్రధానంగా వినియోగిస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ హిమాలయన్ బర్రెల పాలు, మాంసం ఇకపై మనం స్థానిక స్టోర్లలోనూ చూసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.