దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయని.. తమను హిజాబ్తోనే ఎగ్జామ్స్కు అనుమతివ్వాలని కర్ణాటక ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టూడెంట్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ మీనాక్షీ ఆరోరా సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై సీజేఐ చంద్రచూడ్ పాజిటివ్గా స్పందించారు. హిజాబ్ అంశంపై అత్యవసరంగా విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వివాదంపై విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
హిజాబ్పై గతంలో సుప్రీం భిన్న తీర్పులు:
కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం వివాదంపై గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు భిన్న తీర్పులిచ్చింది. హిజాబ్ నిషేధంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. జస్టిస్ సుధాంశు ధులియా వ్యతిరేకించారు. హిజాబ్పై నిషేధం విధించడం ముస్లిం బాలికల స్వేచ్ఛా వ్యక్తీకరణను ఉల్లంఘించినట్లు కాదని జస్టిస్ హేమంత్ తీర్పునివ్వగా.. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ముఖ్యమైనదా.. కాదా.. అని నిర్ణయించడంలో కర్ణాటక హైకోర్టు తప్పు చేసిందని జస్టిస్ సుధాంశు ధులియా అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఆడపిల్లలు తీవ్రమైన అసమానతలను ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం, సమాజం ఈ అడ్డంకులను ఇంకా కొనసాగించకూడదని తీర్పునిచ్చారు. దీంతో తుది తీర్పు సీజేఐ బెంచ్కు సిఫార్సు అవ్వగా.. త్రిసభ్య ధర్మసానానికి ఈ కేసును అప్పగిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ తెలిపారు.
అసలేంటి హిజాబ్ వివాదం?
2022 జనవరిలో కర్ణాటకలోని ఉడుపిలో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు స్టూడెంట్స్ను ఉడుపిలోని ఓ కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. దీనికి నిరసనగా ముస్లిం విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఇక ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే హిందూ విద్యార్థులు కూడా కాలేజ్ యాజమాన్యానికి మద్దతుగా నిరసనలకు దిగడం మరింత అగ్గిరాజేసింది. ఈ అంశం తీవ్ర వివాదంగా మారి రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలకు దారితీసింది. 18జిల్లాల్లో, 55 కాలేజీల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ విద్వేషపు సెగలు ఉడుపి నుంచి ఇతరప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి.
కర్ణాటక హైకోర్టు ఏం తీర్పునిచ్చింది?
విద్యార్థులు స్కూల్ యాజమాన్యం చెప్పిన యూనిఫాం మాత్రమే ధరించాలని, కాలేజీల్లో ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించబోమని ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేయగా..ఈ వివాదం కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. అక్కడ ముస్లిం విద్యార్థులకు చుక్కెదురైంది. విద్యా సంస్థల్లో హిజాబ్ను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని పేర్కొంది. ఇక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.హిజాబ్ నిషేధం కేసులో అత్యున్నత న్యాయస్థానం బెంచ్ విభిన్న తీర్పును వెలువరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hijab, Karnataka, Supreme Court